Chevireddy Bhaskar Reddy: జైల్లో ఉన్న చెవిరెడ్డికి అస్వస్థత... ఆసుపత్రికి తరలింపు

వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనకు ఉదయం ఛాతీలో నొప్పి రావడంతో జైలు అధికారులు వెంటనే స్పందించారు. ప్రాథమికంగా జైలులోని వైద్యులతో పరీక్షలు చేయించిన అనంతరం, మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ప్రభుత్వాసుపత్రిలోని ఫిజియోథెరపీ విభాగంలో వైద్యులు చెవిరెడ్డికి పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు స్పష్టం చేశారు. ఈరోజు సాయంత్రం వరకు ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉంటారని, అనంతరం తగిన మందులు ఇచ్చి డిశ్చార్జ్ చేస్తారని తెలిపారు. ఈ సాయంత్రానికి చెవిరెడ్డిని తిరిగి జిల్లా జైలుకు తరలించే అవకాశాలున్నాయి.

కాగా, ఈ కేసుకు సంబంధించి చెవిరెడ్డిని ఐదు రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ సిట్ అధికారులు శుక్రవారం విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అదే సమయంలో, చెవిరెడ్డి తరఫు న్యాయవాదులు బెయిల్ మంజూరు చేయాలని, జైలు భోజనం పడటం లేదని ఇంటి నుంచి భోజనం తెప్పించుకునేందుకు అనుమతించాలని కోర్టును అభ్యర్థిస్తూ వేర్వేరు పిటిషన్లు సమర్పించారు. ఈ పిటిషన్లపై ఈనెల 23న ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది.

Chevireddy Bhaskar Reddy
Chevireddy
Vijayawada
YSRCP
Excise Scam
AP Politics
Vijayawada ACB Court
Andhra Pradesh
Remand Prisoner
Hospitalized

More Telugu News