PM Modi: సైప్రస్‌లో ప్రధాని మోదీకి ప్రవాస భారతీయుల ఘన స్వాగతం

PM Modi thanks Indian diaspora in Cyprus says India will keep working to deepen ties
షార్ట్స్‌లో చూడండి
భారత ప్రధాని నరేంద్ర మోదీ సైప్రస్ పర్యటనలో భాగంగా నిన్న‌ ఆ దేశంలో అడుగుపెట్టారు. రెండు దశాబ్దాల తర్వాత ఒక భారత ప్రధాని సైప్రస్‌లో పర్యటించడం ఇదే ప్రథమం కావడంతో ఈ పర్యటనకు విశేష ప్రాధాన్యత ఏర్పడింది. అక్కడ స్థిరపడిన ప్రవాస భారతీయులు ప్రధాని మోదీకి అత్యంత ఉత్సాహంగా, ఆత్మీయంగా స్వాగతం పలికారు. ఈ ఘన స్వాగతానికి ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. సైప్రస్‌తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి భారత్ కట్టుబడి ఉందని ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌ స్పష్టం చేశారు.

ఆదివారం సైప్రస్ రాజధాని నికోసియాకు చేరుకున్న ప్రధాని మోదీకి ఆ దేశ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్, ఇతర ఉన్నతాధికారులు సాదరంగా స్వాగతం పలికారు. ఈ ప్రత్యేక ఆదరణకు గాను ఆ దేశ‌ అధ్యక్షుడికి ప్రధాని మోదీ సోషల్ మీడియా ద్వారా ధన్యవాదాలు తెలియ‌జేశారు.

2026లో సైప్రస్ యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న విష‌యం తెలిసిందే. అలాగే భారత్ ఆ ప్రాంతంలో తన ఉనికిని పటిష్ఠం చేసుకోవాలని చూస్తున్న సమయంలో ఈ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. "సైప్రస్ ఒక సన్నిహిత మిత్రదేశం. మధ్యధరా ప్రాంతం, యూరోపియన్ యూనియన్‌లలో ఒక ముఖ్యమైన భాగస్వామి" అని ప్రధాని మోదీ అభివర్ణించారు. వాణిజ్యం, పెట్టుబడులు, భద్రత, సాంకేతికత, ప్రజల మధ్య సంబంధాలు వంటి రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించుకోవడానికి అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు.

నిన్న‌ సైప్రస్ ప్రధాన ఆర్థిక కేంద్రమైన లిమాసోల్‌లో ప్రధాని మోదీ, అధ్యక్షుడు క్రిస్టోడౌలిడెస్ ఇరు దేశాల వ్యాపార ప్రముఖులతో సమావేశమయ్యారు. ఆర్థిక సహకారాన్ని పెంపొందించుకోవడంపై ఇరుపక్షాలు ఆసక్తి కనబరిచాయి. ద్వైపాక్షిక సంబంధాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లే ఉద్దేశంతో నేడు అధికారిక చర్చలు, బహుళస్థాయి సహకార ఒప్పందాలపై సంతకాలు జరగనున్నాయి.

ఈ పర్యటన కేవలం ద్వైపాక్షిక సంబంధాలకే పరిమితం కాకుండా భారత్‌కు సంబంధించిన అంతర్జాతీయ అంశాలపై సైప్రస్ అందిస్తున్న మద్దతుకు కృతజ్ఞతగా నిలుస్తోంది. అంతేకాకుండా టర్కీ, పాకిస్థాన్‌లతో కూడిన ప్రాంతీయ క్లిష్టతల నేపథ్యంలో ఇది ఒక సున్నితమైన దౌత్య సంకేతంగా కూడా భావిస్తున్నారు.

కాగా, సైప్రస్ పర్యటన ముగించుకుని ప్రధాని మోదీ కెనడాలో జరిగే జీ7 సదస్సులో పాల్గొంటారు. ఆ తర్వాత ఆయన క్రొయేషియాలో పర్యటిస్తారు. 
Go Back to Shorts
PM Modi
Cyprus
India Cyprus relations
Indian diaspora Cyprus
Nicos Christodoulides
Cyprus visit
India foreign policy
European Union
G7 summit
Croatia

More Telugu News