Piyush Chawla: క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన పీయూష్ చావ్లా

Piyush Chawla Announces Retirement From All Cricket Formats
షార్ట్స్‌లో చూడండి
భారత క్రికెట్ జట్టు లెగ్ స్పిన్నర్, రెండు ప్రపంచ కప్‌ల గెలుపులో పాలుపంచుకున్న పీయూష్ చావ్లా (36) తన సుదీర్ఘ క్రికెట్ ప్రస్థానానికి ముగింపు పలికాడు. అంతర్జాతీయ, దేశవాళీ సహా అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో ఈ విషయాన్ని పంచుకున్నాడు.

"రెండు దశాబ్దాలకు పైగా మైదానంలో గడిపిన తర్వాత, ఈ అద్భుతమైన ఆటకు వీడ్కోలు చెప్పాల్సిన సమయం వచ్చింది. భారత జట్టుకు అత్యున్నత స్థాయిలో ప్రాతినిధ్యం వహించడం నుంచి, 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్లలో సభ్యుడిగా ఉండటం వరకు, ఈ ప్రయాణంలోని ప్రతి క్షణం దేవుడి ఆశీర్వాదమే. ఈ జ్ఞాపకాలు నా హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతాయి" అని చావ్లా తన పోస్టులో పేర్కొన్నారు.

భారత్ తరఫున పీయూష్ చావ్లా 2006 నుంచి 2012 మధ్యకాలంలో 3 టెస్టు మ్యాచ్‌లు, 25 వన్డేలు, 7 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి మొత్తం 43 వికెట్లు పడగొట్టాడు.

ఐపీఎల్‌లో కూడా చావ్లా తనదైన ముద్ర వేశాడు. పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్‌లో 192 వికెట్లు తీశాడు. 2022 నుంచి 2024 వరకు ముంబై ఇండియన్స్ జట్టులో కొనసాగాడు. 2014లో ఐపీఎల్ టైటిల్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో చావ్లా సభ్యుడిగా ఉన్నాడు. తనపై నమ్మకం ఉంచిన ఐపీఎల్ ఫ్రాంచైజీలకు ధన్యవాదాలు తెలిపాడు. ఐపీఎల్ తన కెరీర్‌లో ఒక ప్రత్యేక అధ్యాయం, అందులో ఆడిన ప్రతి క్షణాన్ని తాను ఆస్వాదించానని చావ్లా తెలిపాడు.

తన ఎదుగుదలకు కారణమైన కోచ్‌లు కే.కే. గౌతమ్, దివంగత పంకజ్ సారస్వత్‌లకు చావ్లా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. కష్టసుఖాల్లో అండగా నిలిచిన తన కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా తనపై నమ్మకం ఉంచి మార్గనిర్దేశం చేసిన తన దివంగత తండ్రికి ధన్యవాదాలు తెలియజేశాడు. "ఆయన లేకపోతే ఈ ప్రయాణం సాధ్యమయ్యేది కాదు" అని భావోద్వేగంతో పేర్కొన్నాడు.
Go Back to Shorts
Piyush Chawla
Indian Cricketer
Cricket Retirement
IPL

More Telugu News