భారత్ పోరాటం మరో దేశంపై కాదు.. కానీ పాకిస్థాన్ సైన్యం ఉగ్రవాదులకు మద్దతుగా వచ్చింది: రక్షణ శాఖ

  • ఆపరేషన్ సిందూర్ లక్ష్యం ఉగ్ర స్థావరాలేనని రక్షణ శాఖ స్పష్టీకరణ
  • ఉగ్రవాదులకు పాక్ సైన్యం అండగా నిలిస్తే భారత్ దీటుగా స్పందించిందని వెల్లడి
  • పాక్ సైనిక నష్టాలకు ఆ దేశానిదే బాధ్యత అని స్పష్టీకరణ
మే 7వ తేదీన చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' సైనిక చర్య ఉగ్రవాద స్థావరాల లక్ష్యంగానే జరిగిందని భారత రక్షణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. తమ పోరాటం ఉగ్రవాదంపైనే తప్ప, మరో దేశంపై కాదని వారు పునరుద్ఘాటించారు. ఆపరేషన్ సిందూర్‌పై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అధికారులు ఈ వివరాలను వెల్లడించారు.

ఉగ్రవాదాన్ని, ఉగ్రవాదులను ఏరివేయడమే తమ ప్రాథమిక లక్ష్యమని అధికారులు తెలిపారు. అయితే, ఈ క్రమంలో పాకిస్థాన్ సైనిక దళాలు ఉగ్రవాదులకు మద్దతుగా నిలిచాయని, ఈ పోరాటాన్ని వారు తమదిగా భావించారని పేర్కొన్నారు. పాకిస్థాన్ సైన్యం జోక్యం చేసుకోవడంతో, భారత దళాలు తీవ్రంగా, దీటుగా ప్రతిస్పందించాల్సి వచ్చిందని వివరించారు.

ఈ ఘర్షణలో పాకిస్థాన్ సైన్యానికి ఏదైనా నష్టం వాటిల్లితే, దానికి పూర్తి బాధ్యత పాకిస్థాన్‌దే అవుతుందని రక్షణ శాఖ అధికారులు తేల్చిచెప్పారు. పాకిస్థాన్ దాడులకు ప్రయత్నించిన సమయంలో భారత గగనతల రక్షణ వ్యవస్థలు అత్యంత సమర్థవంతంగా పనిచేశాయని, శత్రువుల ప్రయత్నాలను విజయవంతంగా అడ్డుకున్నాయని తెలిపారు. ఉగ్రవాదులకు పాక్ సైన్యం అండగా నిలవడం వల్లే పరిస్థితులు మారాయని, అందుకు తగిన జవాబు ఇచ్చామని పేర్కొన్నారు.

Indian Army
Pakistan
Operation Sindhu
Terrorism
Counter-terrorism
India-Pakistan Conflict
Military Operation

More Telugu News