Karnataka Former DGP: కళ్లల్లో కారం చల్లి, చేతులు కట్టేసి.. భర్తను చంపిన కర్ణాటక మాజీ డీజీపీ భార్య

- శరీరంపై కత్తిపోట్లు.. రక్తపు మడుగులో మృతదేహం
- ఆస్తి వివాదాలు, మానసిక అనారోగ్యమే కారణమంటున్న పోలీసులు
- భార్య, కుమార్తెపై కేసు నమోదు చేసిన పోలీసులు
కర్ణాటక మాజీ డీజీపీ, సీనియర్ ఐపీఎస్ అధికారి ఓం ప్రకాశ్ (72) బెంగళూరులోని తన నివాసంలో దారుణ హత్యకు గురయ్యారు. ఆదివారం సాయంత్రం హెచ్ఎస్ఆర్ లేఅవుట్లోని ఆయన ఇంట్లో రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాన్ని గుర్తించారు. ఆయన పొట్ట, ఛాతీ భాగాల్లో బలమైన కత్తిపోట్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఈ హత్య కేసులో ఆయన భార్య పల్లవినే ప్రధాన నిందితురాలిగా అనుమానిస్తూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంట్లో ఉన్న కుమార్తె కృతిని కూడా విచారిస్తున్నారు.
ఓం ప్రకాశ్ కుమారుడు కార్తీక్ ఫిర్యాదు ఆధారంగా పల్లవి, కృతిలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆస్తి పంపకాల విషయంలో దంపతుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు తొలుత వార్తలు వెలువడ్డాయి. అయితే, తన తల్లి పల్లవి గత 12 ఏళ్లుగా తీవ్ర మానసిక సమస్య (స్కిజోఫ్రెనియా)తో బాధపడుతోందని, చికిత్స తీసుకుంటోందని కుమారుడు కార్తీక్ ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. భర్త తనను చంపేస్తాడని, తుపాకీతో బెదిరిస్తున్నాడని ఆమె తరచూ భయపడేదని, భ్రాంతులకు లోనయ్యేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
ఆదివారం మధ్యాహ్నం జరిగిన గొడవలో పల్లవి.. ఓం ప్రకాశ్ ముఖంపై కారం చల్లి, ఆపై కట్టేసి కత్తులతో పలుమార్లు పొడిచి, పగిలిన గాజు సీసాతో కూడా దాడి చేసినట్లు తీవ్ర ఆరోపణలున్నాయి. ఆదివారం సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పదునైన ఆయుధంతో దాడి వల్లే తీవ్ర రక్తస్రావమై ఓం ప్రకాశ్ మరణించి ఉంటారని ప్రాథమికంగా నిర్ధారించారు. ఇది కుటుంబ అంతర్గత వ్యవహారంగానే కనిపిస్తోందని, అన్ని కోణాల్లో లోతుగా దర్యాప్తు చేస్తున్నామని బెంగళూరు పోలీస్ అధికారులు వెల్లడించారు. 1981 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ఓం ప్రకాశ్, 2015లో రాష్ట్ర డీజీపీగా నియమితులయ్యారు.