మొన్న హెయిర్ డ్రైయర్... ఇవాళ ట్రిమ్మర్... పీఎస్ఎల్ లో ఆటగాళ్లకు గిఫ్టులివే!

  • ఇటీవల ఓ ఆటగాడికి హెయిర్ డ్రైయర్ గిఫ్ట్ 
  • కరాచీ బౌలర్ హసన్ అలీకి 'ట్రిమ్మర్' కానుక
  • 4 ఓవర్లలో 28 పరుగులిచ్చి 4 వికెట్లు తీసినందుకు అవార్డు 
పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) 2025 సీజన్‌లో బాగా ఆడిన ఆటగాళ్లకు ఇస్తున్న గిఫ్టులు సోషల్ మీడియాలో కామెడీ సృష్టిస్తున్నాయి. ఇటీవల ఒక ఆటగాడికి హెయిర్ డ్రైయర్ కానుకగా ఇవ్వగా, తాజాగా మరో ఆటగాడికి ట్రిమ్మర్ ను ఇచ్చారు. ఖలందర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కరాచీ కింగ్స్ జట్టు ఓటమి పాలైనప్పటికీ, ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ హసన్ అలీ అద్భుత ప్రదర్శనకు గాను అతనికి 'ట్రిమ్మర్' ను బహుమతిగా అందజేశారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

లాహోర్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో కరాచీ కింగ్స్ 65 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. అయితే, హసన్ అలీ మాత్రం తన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. కేవలం 4 ఓవర్లు బౌలింగ్ చేసి, 28 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. అతని అత్యుత్తమ ప్రదర్శనను గుర్తిస్తూ, మ్యాచ్ అనంతరం జట్టు సహాయక సిబ్బంది ఒకరు హసన్ అలీకి 'సర్ఫ్ ఎక్సెల్ జిద్ సే ఖేల్ టాప్ పెర్ఫార్మర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డుగా ట్రిమ్మర్‌ను అందించారు. దీనికి సంబంధించిన వీడియోను కరాచీ కింగ్స్ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది. 

ఇదే లీగ్‌లో పెషావర్ జల్మీతో జరిగిన మ్యాచ్‌లో కరాచీ కింగ్స్ ఆటగాడు జేమ్స్ విన్స్‌కు హెయిర్ డ్రైయర్ బహుమతిగా ఇవ్వడం గమనార్హం. ఈ వినూత్న బహుమతుల పరంపర ఇప్పుడు మళ్లీ వైరల్ అయింది.



More Telugu News