Hansika Motwani: బాంబే హైకోర్టును ఆశ్రయించిన హన్సిక... ఎందుకంటే...!

- హన్సికపై గృహ హింస కేసు
- గతంలో హన్సికపై ఫిర్యాదు చేసిన సోదరుడి భార్య
- ఈ కేసులో హన్సిక, ఆమె తల్లికి ఇప్పటికే ముందస్తు బెయిల్ మంజూరు
- ఈ కేసును కొట్టివేయాలంటూ తాజాగా హైకోర్టులో హన్సిక క్వాష్ పిటిషన్
నటి హన్సిక మోత్వాని బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన గృహ హింస కేసును కొట్టివేయాలని ఆమె కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ సారంగ్ కొత్వాల్, జస్టిస్ ఎస్.ఎం. మోదక్లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించింది.
హన్సిక సోదరుడి భార్య ముస్కాన్ జేమ్స్ గతంలో హన్సిక, ఆమె తల్లి జ్యోతి మోత్వానిపై గృహ హింస కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ధర్మాసనం ముస్కాన్ జేమ్స్కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 3వ తేదీకి వాయిదా వేసింది.
హన్సిక సోదరుడు ప్రశాంత్ మోత్వాని, టీవీ నటి ముస్కాన్ జేమ్స్ను 2020లో వివాహం చేసుకున్నారు. అయితే, కొన్ని కారణాల వల్ల వారు 2022లో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఆ తరువాత ముస్కాన్ జేమ్స్... హన్సిక, ప్రశాంత్, జ్యోతిలపై గృహ హింస చట్టం కింద ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదైంది.
గతంలో ముంబయి సెషన్స్ కోర్టు హన్సిక, ఆమె తల్లి జ్యోతిలకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పుడు తమపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ వారు బాంబే హైకోర్టును ఆశ్రయించారు.