ఫిర్యాదు చేయడానికి వచ్చిన బాలికపై కానిస్టేబుల్ అత్యాచారం.. బెంగళూరులో ఘోరం
- హోటల్ కు తీసుకెళ్లి, మద్యం తాగించి ఘోరం
- వీడియోలతో బెదిరింపులకు పాల్పడ్డ కానిస్టేబుల్
- పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేసిన పోలీసులు
బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. స్నేహం పేరుతో దగ్గరైన విక్కీ అనే యువకుడు తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని బాధిత బాలిక మైకో లేఔట్ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లింది. ఈ క్రమంలో ఆ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న అరుణ్ సదరు బాలికకు సహాయం చేస్తానని నమ్మబలికాడు. అనంతరం మాయమాటలు చెప్పి, ఓ హోటల్ కు తీసుకువెళ్లి మద్యం తాగించాడు. ఆ మత్తులో బాలికపై అఘాయిత్యం చేశాడు. ఆపై వీడియోలు తీసి ఈ దారుణాన్ని ఎవరికైనా చెబితే వాటిని ఇంటర్ నెట్ లో పెడతానంటూ బెదిరించాడు.
దీంతో బాలిక భయాందోళనలకు గురై మౌనంగా ఉండిపోయింది. గతేడాది జులైలో ఈ దారుణం జరగగా ఇటీవల బాధితురాలు ఆ విషయాన్ని తన తల్లికి చెప్పింది. దీంతో మైకో లేఔట్ పోలీస్ స్టేషన్ లో బాధితురాలి తల్లి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా ప్రాథమిక విచారణ జరిపిన పోలీసులు విక్కీతో పాటు కానిస్టేబుల్ అరుణ్ ను అదుపులోకి తీసుకుని పోక్సో కేసు నమోదు చేశారు.