గురువుల ప్రాధాన్యత గురించి మాట్లాడిన రేణు దేశాయ్

Renu Desai talks about teachers importance
  • విజయవాడలో సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమం
  • బీసీవై పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమం
  • హాజరైన రేణు దేశాయ్
ప్రముఖ నటి, మరాఠీ దర్శకురాలు రేణు దేశాయ్ నేడు విజయవాడలో బీసీవై పార్టీ (భారత చైతన్య యువజన పార్టీ) నిర్వహించిన సావిత్రీ బాయి పూలే జయంతి కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె సమాజంలో ఉపాధ్యాయుల ప్రాధాన్యత గురించి వివరించారు. పిల్లలు తల్లి కంటే ఉపాధ్యాయుల నుంచే ఎక్కువగా నేర్చుకుంటారని, సమాజంలో తల్లి తర్వాత స్థానం మహిళా టీచర్లదేనని అన్నారు. 

తన పిల్లలు అకీరా, ఆద్యల టీచర్లకు కూడా తాను ఇదే చెబుతానని తెలిపారు. ఇప్పటి రోజుల్లో పిల్లలు సెలవుల్లో మాత్రమే తల్లిదండ్రులతో గడుపుతారని, కానీ అంతకంటే ఎక్కువ సమయం టీచర్లతో గడుపుతారని రేణు దేశాయ్ వివరించారు. మట్టి ముద్దకు ఒక రూపాన్ని ఇచ్చేది గురువులేనని, నర్సరీలో చేరిన పిల్లలు మట్టి ముద్దల వంటి వారైతే, వారిని తీర్చిదిద్దేది గురువులేనని అన్నారు. 

ఒకరకంగా దేశ భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందని అభిప్రాయపడ్డారు. ఏమీ తెలియని వయసులో చిన్న పిల్లలు స్కూళ్లలో చేరి ఉపాధ్యాయుల నుంచి నేర్చుకుని... ఇంజినీర్లుగా, డాక్టర్లుగా, లీడర్లుగా సమాజంలోకి వెళతారని తెలిపారు. అందుకే ఉపాధ్యాయుల చేతుల్లో పెద్ద బాధ్యత ఉన్నట్టు భావించాలని రేణు దేశాయ్ పేర్కొన్నారు. 

ఇక, సావిత్రి బాయి పూలే గురించి మహారాష్ట్రలో తెలుసని, కానీ మిగతా చోట్ల ఆమె గురించి ఎక్కువగా తెలియదని రేణు దేశాయ్ అన్నారు. బ్రిటీషర్లకు వ్యతిరేకంగానే కాకుండా, కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడి... మొదట తాను టీచరై, ఆ తర్వాత బాలికల కోసం పాఠశాలను స్థాపించిందని వివరించారు.
Advertisement
Renu Desai
Teachers
BCY Party
Vijayawada

More Telugu News