రాంగోపాల్ వర్మ క్వాష్ పిటిషన్‌పై ఏజీ వచ్చి వాదనలు వినిపిస్తారు: హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వ న్యాయవాది

AP HC postponed hearings on Varma quash petition
  • తనపై కేసులు నమోదు కాకుండా అదేశించాలని హైకోర్టులో వర్మ పిటిషన్
  • ఒకే అంశంపై పలుచోట్ల కేసులు పెడుతున్నారని హైకోర్టుకు తెలిపిన వర్మ న్యాయవాది
  • ప్రభుత్వ న్యాయవాది విజ్ఞప్తి మేరకు విచారణ సోమవారానికి వాయిదా
దర్శకుడు రాంగోపాల్ వర్మ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై అడ్వకేట్ జనరల్ (ఏజీ) వచ్చి వాదనలు వినిపిస్తారని, కాబట్టి తమకు సమయం కావాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది ఏపీ హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ అభ్యర్థనకు హైకోర్టు అంగీకరించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్‌పై సోషల్ మీడియాలో అనుచిత, అసభ్యకర పోస్టుల వ్యవహారంలో ఇక ముందు ఎలాంటి కేసులు నమోదు కాకుండా ఆదేశించాలని కోరుతూ వర్మ పిటిషన్ దాఖలు చేశారు. తనపై రాజ్యాంగ విరుద్ధంగా కేసులు పెట్టారన్నారు. ఈ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది.

ఒకే అంశంపై పలుచోట్ల కేసులు పెడుతున్నారని ఆర్జీవీ తరఫు న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు. వివిధ ప్రాంతాల్లో కేసులు నమోదు కాకుండా చూడాలని కోరారు. అయితే, ఏజీ వచ్చి వాదనలు వినిపిస్తారని, కాబట్టి సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. ఇందుకు హైకోర్టు కూడా అంగీకరించింది.

ఇదిలా ఉండగా, రాంగోపాల్ వర్మ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ క్రమంలో వర్మ ఓ వీడియోను విడుదల చేశారు. తాను కేసులకు భయపడటం లేదని వెల్లడించారు. తాను ట్వీట్స్ పెట్టిన వారికి కాకుండా సంబంధం లేని వారి మనోభావాలు దెబ్బతింటే ఈ కేసులు, సెక్షన్లు ఎలా వర్తిస్తాయని ప్రశ్నించారు. ప్రస్తుతం తాను ఓ సినిమా షూటింగ్‌లో ఉన్నానని... అందుకే విచారణకు హాజరుకాలేకపోతున్నానని తెలిపారు.
Advertisement
Ram Gopal Varma
Telugudesam
Pawan Kalyan
AP High Court

More Telugu News