Harish Rao: వారిని జైలుకు పంపిస్తామన్న రేవంత్ రెడ్డి మాటలు నీటి మూటలు: హరీశ్ రావు

Harish Rao blames government for food poision in hostels
  • ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇంకెంత మంది బలి కావాలని ఆగ్రహం
  • వాంకిడి మరువకముందే మాగనూరులోనూ ఫుడ్ పాయిజన్ అయిందన్న హరీశ్ రావు
  • ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదన్న మాజీ మంత్రి
హాస్టళ్లలో కల్తీ ఆహారం పెడితే జైలుకు పంపిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో హెచ్చరించారని, కానీ అవన్నీ వట్టి మాటలేనని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఈ ప్రభుత్వం నిర్లక్ష్యానికి ఇంకెంతమంది విద్యార్థులు ఆసుపత్రి పాలవ్వాలి? ఇంకెందరు ప్రాణాలు కోల్పోవాలి? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వానివి మాటలే తప్ప చేతలు లేవని విమర్శించారు. హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనలపై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు.

వాంకిడిలో వందమంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్‍‌కు గురై పది రోజులు కూడా గడవలేదని, ఇప్పుడు మళ్లీ మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయినట్లు తెలిసిందన్నారు. 30 మంది విద్యార్థులు వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పితో మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు.

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్ కేసులు నమోదవుతున్నా, ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదని మండిపడ్డారు. తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ... కనీస చర్యలకు ఉపక్రమించడం లేదని ఆరోపించారు. విద్యార్థులకు కల్తీ ఆహారం పెడితే జైలుకు పంపిస్తామన్న సీఎం మాటలు నీటి మూటలే అయ్యాయన్నారు.
Harish Rao
BRS
Revanth Reddy
Telangana

More Telugu News