ఉన్మాది పెట్రోలు దాడిలో గాయపడిన బాలిక మృతి.. నిందితుడి అరెస్ట్

nter student died in badvel incident
  • పెళ్లయినా బాల్య స్నేహితురాలిపై మోజు
  • మాట్లాడాలి రమ్మని పిలిచి పెట్రోల్ పోసి నిప్పంటించిన నిందితుడు
  • 80 శాతం గాయాలతో ఆసుపత్రిలో చేరిన బాలిక మృతి
  • గంటల వ్యవధిలోనే నిందితుడి అరెస్ట్ 

స్నేహితుడి చేతిలో తీవ్రంగా గాయపడి కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇంటర్ విద్యార్ధిని (16) మృతి చెందింది. ఆ ఘటనకు కారణమైన ప్రేమోన్మాది విఘ్నేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కడపలోని ఓ హోటల్‌లో వంట మాస్టర్‌గా పనిచేస్తున్న విఘ్నేశ్‌కు ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్ధిని (16)తో చిన్న నాటి నుంచి స్నేహం ఉంది. 

అతడికి ఇప్పటికే వివాహం కాగా, భార్య ప్రస్తుతం గర్భవతి. అయినప్పటికీ విద్యార్థినితో స్నేహం కొనసాగించాడు. ఈ క్రమంలో శనివారం ఆమెకి ఫోన్ చేసి తనను కలవాలని కోరాడు. లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దాంతో ఆమె కళాశాల నుంచి ఆటోలో బయలుదేరగా, విఘ్నేశ్ మధ్యలో అదే ఆటో ఎక్కాడు. ఇద్దరూ బద్వేలుకు పది కిలో మీటర్ల దూరంలోని పీపీకుంట చెక్‌పోస్టు వద్ద దిగి సమీపంలోని ముళ్ల పొదలోకి వెళ్లారు. ఆ తర్వాత అక్కడ ఏమి జరిగిందో ఏమో కానీ కొంతసేపటికి విఘ్నేశ్ .. ఆమెపై పెట్రోల్ పోసి నిప్పు అంటించి పరారయ్యాడు. 

కాలిన గాయాలతో ఆ విద్యార్ధిని కేకలు వేయడంతో కొందరు మహిళలు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. తీవ్రంగా గాయపడిన బాలికను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. 

ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన సీఎం చంద్రబాబు నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని పోలీసులను ఆదేశించారు. పోలీసులు నాలుగు బృందాలను ఏర్పాటు నిందితుడి కోసం వేట మొదలుపెట్టారు. ఈ క్రమంలో గత రాత్రి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, 80 శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న బాధితురాలు ఈ ఉదయం మృతి చెందింది. 
Go Back to Shorts
YSR Dist
Crime News
Inter Student

More Telugu News