అయోధ్య రామ మందిరంపై జీఎస్టీ ఎన్ని కోట్లంటే...!

How Much GST Will Ayodhyas Ram Temple Generate
  • ప్రభుత్వానికి సుమారు రూ.400 కోట్ల ఆదాయం 
  • ఒక్క రూపాయి కూడా మినహాయింపు తీసుకోబోమన్న ట్రస్ట్
  • అయోధ్యలో 70 ఎకరాల విస్తీర్ణంలో మొత్తం 18 ఆలయాల నిర్మాణం
  • ఆలయాల నిర్మాణంపై జీఎస్టీ పూర్తిగా చెల్లిస్తామన్న ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్
అయోధ్యలో బాల రాముడి మందిర నిర్మాణం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి భారీ మొత్తంలో ఆదాయం సమకూరుతుందని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు. సోమవారం అయోధ్యలో జరిగిన ఓ సన్మాన కార్యక్రమంలో చంపత్ రాయ్ మాట్లాడుతూ.. రామ మందిరం సహా 70 ఎకరాల్లో ట్రస్టు చేపట్టిన 18 ఆలయాల నిర్మాణంపై జీఎస్టీ రూపంలో కేంద్రానికి రూ.400 కోట్లు సమకూరుతుందని చెప్పారు. ఇది కేవలం అంచనా మాత్రమేనని, నిర్మాణాలు పూర్తయ్యాక ఆ మొత్తం ఇంకా పెరగవచ్చని వివరించారు.

ఆలయాల నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి మినహాయింపులు ఆమోదించబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా మినహాయింపు కోరబోమని వెల్లడించారు. జీఎస్టీ పూర్తిగా వంద శాతం చెల్లిస్తామని తెలిపారు. రామమందిర నిర్మాణానికి ప్రపంచం నలుమూలల నుంచి విరాళాలు వచ్చాయని, ఒక దశలో విరాళాలు పంపించ వద్దంటూ విజ్ఞప్తి చేశామని గుర్తుచేశారు. రామ భక్తులు పంపిన విరాళాలతో బాల రాముడి మందిరాన్ని విశాలంగా, అద్భుతంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు.

ఒక్కరోజే 2 లక్షల మంది భక్తులు వచ్చినా ఎలాంటి ఇబ్బందిలేకుండా రామయ్యను దర్శించుకునేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం జరిగిన ఉద్యమంలో ఎంతమంది భక్తులు, ఎన్ని కుటుంబాలు ఇబ్బంది పడ్డాయన్నది నాకు తెలియదు. అయితే, రాముడి గుడి కోసం జరిగిన ఈ యజ్ఞం వెయ్యేళ్ల స్వాతంత్ర్య పోరాటానికి తక్కువేమీ కాదని, ప్రజలందరి సంక్షేమం కోసం జరిగిందని చంపత్ రాయ్ అన్నారు.
Advertisement
Ayodhya
Ram Mandir
GST
Trust
Champat Rai
Temples

More Telugu News