వారణాసి నుంచి ప్రియాంక పోటీ చేసి ఉంటే మోదీ ఓడిపోయేవారు: రాహుల్ గాంధీ
- బీజేపీ బలాన్ని తగ్గించేందుకు ఇండియా కూటమి పార్టీలు ఐకమత్యంతో పోరాడాయన్న రాహుల్ గాంధీ
- అయోధ్యలో బీజేపీకి ప్రజలు గుణపాఠం చెప్పారన్న కాంగ్రెస్ అగ్రనేత
- అమేథి, రాయ్బరేలీలలో ప్రజలు చారిత్రాత్మక విజయం అందించారన్న ప్రియాంకగాంధీ
యూపీలోని రాయ్బరేలిలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్లమెంట్లో బీజేపీ బలాన్ని తగ్గించేందుకు రాయ్బరేలీ, అమేథీలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఇండియా కూటమి పార్టీలు ఐకమత్యంతో పోరాడాయన్నారు. అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమంలో సామాన్యులను మరిచి... పారిశ్రామికవేత్తలు, ప్రముఖులకే ప్రాధాన్యం ఇచ్చారని.. అందుకే బీజేపీకి ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు.
అమేథి, రాయ్బరేలీలలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు చారిత్రాత్మక విజయాన్ని అందించారని ప్రియాంకగాంధీ అన్నారు. ఈరోజు దేశమంతా అయోధ్య వైపు చూస్తోందని... స్వచ్ఛమైన, అంకితభావంతో కూడిన రాజకీయాలు అవసరమనే సందేశాన్ని ఈ ప్రాంతం చాటిచెప్పిందన్నారు. కాంగ్రెస్, సమాజ్వాది పార్టీ శ్రేణులు ఎన్నికల్లో సమన్వయంతో సాగి భారీ విజయాన్ని కట్టబెట్టారన్నారు.