ఓటమికి భయపడిన పిరికిపందలే పులివర్తి నానిపై దాడికి కారకులు: చంద్రబాబు
- చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి
- తిరుపతి మహిళా వర్సిటీ వద్ద ఉద్రిక్తత
- పోలింగ్ రోజున దాడులు చేశారన్న చంద్రబాబు
- తర్వాత రోజు కూడా దాడులకు తెగబడుతున్నారని ఆగ్రహం
- ఈసీ, డీజీపీ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
స్ట్రాంగ్ రూమ్ ఉన్న పద్మావతి మహిళా యూనివర్సిటీలో 150 మంది వైసీపీ రౌడీలు కత్తులు, రాడ్లతో స్వైరవిహారం చేస్తుంటే ఓటర్ల తీర్పుకు రక్షణ ఏది? అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
"నిన్న పోలింగ్ రోజున కూడా హింసకు పాల్పడ్డారు. పోలింగ్ తర్వాత కూడా దాడులు చేస్తున్నారు. పోలింగ్ అనంతరం దాడులను నివారించడంలోనూ... ప్రజలకు, ప్రతిపక్ష నేతలకు భద్రత కల్పించడంలోనూ పోలీసులు విఫలం అవుతున్నారు" అంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు.
మరోవైపున మాచర్లలోనూ ఇప్పుడూ హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయని వెల్లడించారు. తాడిపత్రిలోనూ నిరాటంకంగా దాడులు జరుగుతున్నాయని, లా అండ్ ఆర్డర్ పరిరక్షణ విషయంలో పోలీసుల తీరు సరిగా లేదని విమర్శించారు. ఎన్నికల సంఘం, డీజీపీ, ఎస్పీలు దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని చంద్రబాబు కోరారు.