Chandrababu: మందు బాబులూ... గోవా మద్యంతో జాగ్రత్త!: అనంతపురం అర్బన్ లో చంద్రబాబు

Chandrababu comments on Goa liquor
షార్ట్స్‌లో చూడండి
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అనంతపురం అర్బన్ లో నిర్వహించిన ప్రజాగళం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం సాగిస్తున్న దోపిడీకి మే 13న జరిగే పోలింగ్ తో ముగింపు పలకాలని పిలుపునిచ్చారు. రాతియుగం నుంచి స్వర్ణయుగం వైపు పయనించాలని, కూటమికి ఏ మాత్రం ఢోకా లేదని స్పష్టం చేశారు. 

కేంద్రంలో మోదీ 400 సీట్లతో మళ్లీ ప్రధాని కాబోతున్నారని, ఏపీలో 25కి 25 ఎంపీ సీట్లు కూటమి గెలుస్తుందని అన్నారు. 160 సీట్లతో అసెంబ్లీకి వెళుతున్నాం అని ధీమా వ్యక్తం చేశారు. కూటమి స్పీడు పెరిగిందని, వైసీపీ డీలాపడిపోయిందని చంద్రబాబు పేర్కొన్నారు. 

"నువ్వేం చేశావో చెప్పుకోగలవా సైకో జగన్? ఏం చేస్తావో చెప్పగలవా? ఏం చేశాడో చెప్పడు, ఏం చేస్తాడో చెప్పడు. చేసేదీ లేదు, సచ్చేదీ లేదు... ఈయన పని అయిపోయింది. అందుకే రేపు ఎన్నికల్లో ఐదు వేలు ఇస్తాడు, పది వేలు ఇస్తాడు... అవన్నీ అవినీతి పాపిష్టి డబ్బులే. ప్రలోభాలకు లోనవకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. 

మందుబాబులకు కోపం రావడంలేదా... రూ.60 క్వార్టర్ ను రూ.200కి అమ్ముతున్నాడు. ఇప్పుడు గోవా నుంచి సెకండ్స్ మద్యం తెప్పిస్తున్నాడు. అది తాగితే కడుపులో మంట వచ్చి వెంటనే ఆరోగ్యం పాడవుతుంది. వైసీపీ మద్యాన్ని మాకొద్దంటూ అందరూ తిరుగుబాటు చేసే పరిస్థితికి వచ్చారు. 

ఎక్కడ చూసినా మోసం! ఒకప్పుడు రూ.1000 ఉన్న ట్రాక్టర్ ఇసుక ఇప్పుడు ఐదారు వేలు! ఇసుకలో కూడా డబ్బులు దోచేసిన దుర్మార్గుడు ఈ సైకో జగన్! ఎనిమిది సార్లు కరెంటు చార్జీలు పెంచాడు. నేనెప్పుడైనా కరెంటు చార్జీలు పెంచానా? నాది పరిపాలన సామర్థ్యం... ఇది చేతగాని చెత్త పరిపాలన. 

పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. పొరుగున ఉన్న కర్ణాటకలో తక్కువ ధరలకే లభిస్తుంటే... ఏపీలో ఏంటీ అరాచకం? ఏంటీ దోపిడీ? దీనిపై అడిగితే కేసులు, దౌర్జన్యాలు, హత్యలు! నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా? మాట్లాడితే బటన్ నొక్కుతానంటున్నాడు. ఇప్పుడు అడుగుతున్నా... నువ్వు బటన్ నొక్కేది ఎంత, బొక్కేది ఎంత? చివరికి భూగర్భ ఖనిజ సంపదను కూడా దోచేసే దుర్మార్గులు వీళ్లు. 

అన్నీ అయిపోయి ఇవాళ కొత్త వేషం వేశాడు. మీ ఆస్తులపై కన్నేశాడు. భూమి మీదేనా... లేక జగన్ మోహన్ రెడ్డిదా? మీ భూమిపై జగన్ ఫొటో ఏంటి? భూమి మీది... ఫొటో జగన్ ది! దీన్ని ఏం చేయాలి? జగన్ నాన్న ఇచ్చాడా మీకు? వీళ్ల అమ్మ మొగుడు ఇచ్చాడా మీకు? వీళ్ల అమ్మమ్మ మొగుడు ఇచ్చాడా మీకు? వీళ్ల నాయనమ్మ మొగుడు ఇచ్చాడా?

మీ ఆస్తిపై మీ పెద్దవాళ్ల ఫొటోలు ఉండాలి కానీ, ఈ చెత్త ఫొటో మీ పాస్ బుక్కుపై ఎందుకు? మేం అధికారంలోకి రాగానే ఇవన్నీ తీసేస్తాం. ఇదే కాకుండా మరొక భయంకరమైన చట్టం తీసుకువచ్చాడు. దాని ప్రకారం మీకు ఎలాంటి డాక్యుమెంట్స్ ఉండవు, టెన్ వన్ ఉండదు, అడంగల్ లేదు, ఎన్ కంబరెన్స్ సర్టిఫికెట్ ఉండదు... మీ భూమి జగన్ చేతుల్లో ఉంటుంది... నీ జుట్టు జగన్ పట్టుకని ఊగులాడుతుంటాడు. 

మనకు భూమి అనేది సెంటిమెంటు. వారసత్వంగా వచ్చే భూమి కొందరికి ఎకరం ఉంటుంది, మరొకరికి ఐదు ఎకరాలు ఉంటుంది... మరొకరికి ఐదు సెంట్లే ఉంటుంది... కొందరు భూమిని కష్టపడి కొనుక్కుంటారు. ఇది మనకు, పిల్లలకు జీవనాధారం. కానీ ఈ భూములను జగన్ పోర్టల్ లో పెట్టాడు. అమెరికాలో తన బినామీ పేరిట ఓ కంపెనీ పెట్టి మీ భూముల రికార్డులన్నీ అందులో  పెడతాడట. 

మీరు ఆ భూమిని అమ్మాలంటే జగన్ నామినేట్ చేసిన వ్యక్తి ఆమోదం తెలపాలి. అదే భూమిలో వాటా ఉందంటూ వేరే వాళ్లు కూడా వచ్చారని ఆయన చెబితే... ఇక ఆ భూమి వివాదాల జాబితాలోకి చేరిపోతుంది. మీరు ఆ భూమిని అమ్ముకోవడం కుదరదు. రైతులందరూ ఒకటే గుర్తుంచుకోండి... 13వ తేదీన జగన్ పార్టీకి ఉరేయాలి. చరిత్రలో ఇలాంటి నీచుడ్ని ఎప్పుడైనా ముఖ్యమంత్రిగా చూశారా? తలచుకుంటే నాలాంటి వాడికే ఏమవుతుందో అనిపిస్తుంది. 

ఇవాళ ధర్మవరం సభకు అమిత్ షా వచ్చారు. మూడు రాజకీయ పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడ్డాం. ఇది ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి అని పెట్టుకున్న పొత్తు. అవినీతి పోవాలి, భూ కబ్జాలు పోవాలి, గూండాగిరీ పోవాలి, అమరావతి రాజధానిగా ఉండాలి, పోలవరం పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీళ్లిచ్చేందుకే పొత్తు అని అమిత్ షా వివరించారు" అంటూ చంద్రబాబు పేర్కొన్నారు.
Go Back to Shorts
Chandrababu
Goa Liquor
Anantapur Urban
Praja Galam
TDP
TDP-JanaSena-BJP Alliance
YSRCP

More Telugu News