Padi Kaushik Reddy: కడియం తీరుపై ప్రజలు ఛీఛీ అంటున్నారు: పాడి కౌశిక్ రెడ్డి

దానం నాగేందర్‌పై స్పీకర్ చర్యలు తీసుకుంటే ఆయన భారతదేశ చరిత్రలో నిలిచిపోతారని బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. నాగేందర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచి ఇప్పుడు లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారని... పార్టీ ఫిరాయింపులకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? అని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడితే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత స్పీకర్‌పై ఉంటుందన్నారు. ఈ అంశంపై స్పీకర్ వెంటనే స్పందించాలని కోరారు. స్వయంగా దానం నాగేందర్ కూడా ఓ ఛానల్‌తో మాట్లాడుతూ తాను కాంగ్రెస్‌లో చేరినట్లు చెప్పారని తెలిపారు.

శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... స్పీకర్‌ను కలిసేందుకు వెళ్తే అక్కడ ఎవరూ లేరని... అటెండర్ మాత్రమే ఉన్నారన్నారు. కార్యదర్శి వద్దకు వెళ్తే ఆయన కూడా అందుబాటులోకి రాలేదన్నారు. నలుగురం ఎమ్మెల్యేలం కలిసి వెళ్తే కనీసం రిప్రజెంటేషన్ కూడా తీసుకోకుంటే ఎలా? అని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఫిర్యాదుపై చర్యలు తీసుకోని పక్షంలో కోర్టుకు వెళతామన్నారు. దానం నాగేందర్‌ను వెంటనే అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.

కడియం శ్రీహరి వంటి సీనియర్ నాయకుడు కూడా మోసం చేయడమంటే నమ్మించి గొంతు కోయడమే అన్నారు. ఆయనకు బీఆర్ఎస్ పార్టీ ఏం తక్కువ చేసిందో చెప్పాలన్నారు. తెలంగాణ వచ్చాక ఆయనకు కేసీఆర్ ఎన్నో అవకాశాలు ఇచ్చారన్నారు. కడియం తీరుపై ప్రజలు ఛీఛీ అంటున్నారని... కొట్టే పరిస్థితి కూడా ఉందన్నారు. ఆయన చెప్పే నీతులు ఇవేనా? అని మండిపడ్డారు. అన్నం తినేవాళ్లు అయితే ఇలా చేయరు... అన్నం తినకుండా మరొకటి తినేవాళ్లు మాత్రమే ఇలా చేస్తారని తీవ్ర విమర్శలు చేశారు.
Padi Kaushik Reddy
BJP
Danam Nagender
Kadiam Srihari

More Telugu News