ఏపీలో బీజేపీ ఎన్నికల ఇన్చార్జిలుగా అరుణ్ సింగ్, సిద్ధార్థ్ నాథ్ సింగ్ నియామకం

BJP appoints election incharges for AP
  • పలు రాష్ట్రాలకు ఎన్నికల ఇన్చార్జిలను నియమించిన బీజేపీ హైకమాండ్
  • ఏపీతో పాటు రాజస్థాన్, హర్యానా రాష్ట్రాలకు కూడా ఇన్చార్జిల నియామకం
  • ప్రకటన విడుదల చేసిన బీజేపీ కేంద్ర కార్యాలయం
ఏపీలో మే 13న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ఒకే విడతలో జరగనున్నాయి. పోలింగ్ కు తగినంత సమయం ఉండడంతో ప్రధాన పార్టీలన్నీ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. జాతీయ పార్టీ బీజేపీ తాజాగా పలు రాష్ట్రాలకు ఎన్నికల ఇన్చార్జిలను ప్రకటించింది. 

ఏపీ ఎన్నికల ఇన్చార్జిలుగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి సిద్ధార్థ్ నాథ్ సింగ్ లకు బాధ్యతలు అప్పగించారు. 

అదే సమయంలో రాజస్థాన్, హర్యానా రాష్ట్రాలకు కూడా ఎన్నికల ఇన్చార్జిలను నియమిస్తూ బీజేపీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. రాజస్థాన్ ఇన్చార్జిలుగా వినయ్ సహస్రబుద్ధే, విజయ రహాత్కర్, ప్రవేశ్ వర్మ... హర్యానా ఇన్చార్జిలుగా సతీశ్ పునియా, సురేంద్ర సింగ్ నాగర్ లను నియమించింది. 

ఏపీలో టీడీపీ-జనసేనతో బీజేపీ పొత్తు ఖరారైన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన ఇప్పటికే పలువురు అభ్యర్థులతో జాబితాలు ప్రకటించగా, బీజేపీ కసరత్తులు చేస్తోంది. పొత్తులో భాగంగా బీజేపీకి ఏపీలో 6 ఎంపీ స్థానాలు, 10 అసెంబ్లీ స్థానాలు కేటాయించారు.
Advertisement
BJP
Andhra Pradesh
Incharges
Rajasthan
Haryana

More Telugu News