Hyderabad Temperatures: హైదరాబాద్ లో అప్పుడే మండిపోతున్న ఎండలు.. 40 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు
ఫిబ్రవరి నెల ప్రారంభంలోనే హైదరాబాద్ లో ఎండలు మండిపోతున్నాయి. గత మూడు రోజుల్లో భారీగా పెరిగిన పగటి ఉష్ణోగ్రతలతో గ్రేటర్ వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నగరంలోని జూబ్లీహిల్స్ లో 38.4 డిగ్రీలు, సరూర్ నగర్, చందానగర్ లో 38.3 డిగ్రీలు, బేగంపేటలో 37.6 డిగ్రీలు, ఉప్పల్ లో 37.3 డిగ్రీలు, శేరిలింగంపల్లిలో 37.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పగటి ఉష్ణోగ్రతలతో పాటు, మధ్యాహ్నం వేడిగాలుల తీవ్రత కూడా పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు పెరగడంతో విద్యుత్ వినియోగం పెరుగుతోంది. జనాలు అప్పుడే ఏసీలు, కూలర్లను ఆన్ చేస్తున్నారు. ఇప్పుడే ఎండలు ఈ స్థాయిలో ఉంటే... ఏప్రిల్, మే నెలల్లో ఏ రేంజ్ లో ఉంటాయో అని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు