బీహార్లో అనూహ్య రాజకీయ పరిణామాల నేపథ్యంలో తొలిసారి స్పందించిన ప్రధాని మోదీ
- నితీశ్ కుమార్, నూతన ప్రభుత్వానికి అభినందనలు తెలిపిన ప్రధాని
- బీహార్ అభివృద్ధికి నూతన ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుందనే నమ్మకం ఉందన్న మోదీ
- కొత్త టీమ్ అంకితభావంతో పనిచేస్తుందని విశ్వాసం
బిహార్ ముఖ్యమంత్రిగా రికార్డు స్థాయిలో 9వ సారి నితీశ్ కుమార్ ప్రమాణస్వీకారం చేశారు. ఇండియా కూటమికి గుడ్ బై చెప్పిన ఆయన బీజేపీతో జత కట్టి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కాగా తాజా రాజకీయ పరిణామంతో ‘యూ-టర్న్’ తీసుకునే వ్యక్తిగా నితీశ్ కుమార్పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నితీశ్ కుమార్ ఎప్పుడైనా మారవచ్చని తాను మొదటి నుంచీ చెబుతూనే ఉన్నానని, అతడి రాజకీయాల్లో ఇలా చేయడం ఒక భాగమని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ విమర్శించారు. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. అలసిపోయిన వ్యక్తిని ముఖ్యమంత్రి చేసినట్టుగా అనిపిస్తోందని, ఇంకా ముగియలేదని అన్నారు. కాగా ఇండియా కూటమికి గుడ్ బై చెప్పిన నితీశ్ కుమార్ సారధ్యంలోని జేడీయూ పార్టీ త్వరలోనే ఎన్డీయే కూటమిలో చేరనుంది.