మంత్రివర్గం సూచనల మేరకే గవర్నర్ వ్యవహరించాలి: సుప్రీం కోర్టు

  • అవినీతి ఆరోపణలపై అరెస్టైన తమిళనాడు మంత్రి వి.సెంథిల్ బాలాజీ కేసులో తీర్పు
  • మంత్రిని తొలగించే హక్కు గవర్నర్‌కు లేదని సుప్రీం వ్యాఖ్య
  • ఈ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించిన సర్వోన్నత న్యాయస్థానం
రాష్ట్ర మంత్రివర్గ సూచనల మేరకే గవర్నర్ వ్యవహరించాలని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. మంత్రులను తొలగించే అధికారం గవర్నర్‌కు లేదని పేర్కొంది. తమిళనాడు మంత్రి వి.సెంథిల్ తొలగింపు కేసులో ఈ మేరకు తీర్పు వెలువరించింది. 

రవాణాశాఖలో ఉద్యోగాల పేరిట నిరుద్యోగుల నుంచి భారీగా సొమ్ము వసూలు చేశారన్న ఆరోపణలపై మంత్రి సెంథిల్ బాలాజీని ఈడీ అధికారులు గత జూన్ 13న అరెస్టు చేశారు. దీంతో, మంత్రిని కేబినెట్‌ నుంచి బర్తరఫ్ చేస్తూ గవర్నర్ ఆర్.ఎన్.రవి ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలను మద్రాస్ హైకోర్టు పక్కనపెట్టింది. మంత్రి అరెస్టయ్యాక కూడా మంత్రివర్గంలో కొనసాగడాన్ని సవాలు చేస్తూ ఎం.ఎల్, రవి అనే న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో, సదరు న్యాయవాది సుప్రీం కోర్టును ఆశ్రయించారు. 

ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ అభయ్ ఎస్.ఓకా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నేతృత్వంలోని ధర్మాసనం.. రవి వాదనలను తోసిపుచ్చింది. హైకోర్టు నిర్ణయంతో ఏకీభవిస్తున్నామని పేర్కొంది. ‘‘ప్రాథమికంగా చూస్తే హైకోర్టు తీరు సరైందే. ఓ రాష్ట్ర మంత్రిని గవర్నర్ తనంతట తానుగా బర్తరఫ్ చేయలేరు. రాష్ట్ర మంత్రివర్గం చేసే సిఫార్సులకు అనుగుణంగా గవర్నర్ వ్యవహరించాలి’’ అని కోర్టు స్పష్టం చేసింది.


More Telugu News

Senthil Balaji Supreme Court Tamilnadu