అగ్రదేశాల కంటే మన ఆర్థిక వ్యవస్థ భేష్: నిర్మలా సీతారామన్

Nirmala Sitharaman talks about Indian economy comparison to other nations
  • భారత్ సుస్థిర అభివృద్ధితో దూసుకుపోతోందన్న నిర్మల
  • అగ్రదేశాలు నేల చూపులు చూస్తున్నాయని వ్యాఖ్యలు
  • భారత్ 7 పాయింట్లకు పైబడి అభివృద్ధితో కొనసాగుతుందని వెల్లడి
భారత్ వేగంగా ఆర్థిక అభివృద్ధి సాధిస్తున్న దేశంగా కొనసాగుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఆర్థిక వ్యవస్థల జాబితాలో మూడు, నాలుగు స్థానాల్లో ఉన్న జపాన్, జర్మనీ దేశాలు కూడా నేల చూపులు చూస్తున్న తరుణంలో భారత్ ఐదో స్థానంలో దృఢంగా కొనసాగుతోందని చెప్పారు. ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థలు పతనం దిశగా పయనిస్తున్న నేపథ్యంలోనూ మన దేశ ఆర్థిక వ్యవస్థ మరింత విస్తరిస్తోందని తెలిపారు. 

పార్లమెంటులో ఆర్థిక అంశాలపై చర్చ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడారు. 7 పాయింట్లకు పైబడిన భారత్ అభివృద్ధి రేటు అమోఘం అని పేర్కొన్నారు. రెండో త్రైమాసికంలో భారత్ అభివృద్ధి 7.6 శాతం అని, ఇప్పటికిప్పుడు ప్రపంచంలో ఇది అత్యధికం అని వెల్లడించారు. ఏప్రిల్-జూన్ మాసాల త్రైమాసికంలో భారత జీడీపీ వృద్ధి 7.8 శాతంగా నమోదైందని తెలిపారు.

అన్ని అభివృద్ధి చెందిన దేశాల మార్కెట్ల కొనుగోళ్ల సూచికలతో పోల్చి చూస్తే, భారత్ ఎంతో మెరుగ్గా ఉందని నిర్మలా సీతారామన్ వివరించారు. అమెరికా, యూరప్, కెనడా, ఆస్ట్రేలియా, చైనా తదితర మార్కెట్ల కొనుగోళ్ల సూచీలు అనిశ్చితికర పరిస్థితులు ఎదుర్కొంటున్నాయని, కానీ భారత్ మాత్రం సుస్థిర అభివృద్ధితో ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు.
Go Back to Shorts
Nirmala Sitharaman
Economy
Growth
GDP
India

More Telugu News