ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు ప్రయాణికుడి యత్నం.. ఇండిగో విమానంలో కలకలం

ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ తలుపులు తెరిచేందుకు ప్రయత్నించి కలకలం సృష్టించాడు. సెప్టెంబర్ 30న నాగ్‌పూర్ నుంచి బెంగళూరుకు బయలుదేరిన ఇండిగో విమానంలో ఈ ఘటన వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, స్వప్నిల్ హాలీ అనే వ్యక్తి 6ఈ 6803 ఇండిగో విమానంలో బెంగళూరుకు బయలుదేరాడు. అతడికి ఎమర్జెన్సీ డోరు పక్కన సీటు లభించింది. 

అయితే, విమానం టెకాఫ్‌కు ముందు సిబ్బంది ఇతర ప్రయాణికులతో బిజీబిజీగా ఉండగా స్వప్నిల్ ఆ తలుపు తెరిచే ప్రయత్నం చేశాడు. ఇది చూసిన సిబ్బంది అతడిని అడ్డుకున్నారు. విమానం బెంగళూరు కెంపెగౌడ్ విమానాశ్రయంలో దిగాక పోలీసులకు అప్పగించారు. ఎయిర్‌లైన్స్ ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు సెక్షన్ 336 (ఇతరులను ప్రమాదంలోకి నెట్టడం) కింద కేసు నమోదు చేశారు. అనంతరం, అతడు బెయిల్‌పై విడుదలయ్యాడని సమాచారం.


More Telugu News