జగన్కే చెబుతున్నా.. ఈ అవినీతిని అంతా బయటపెడతాం: పవన్ కల్యాణ్
- ఉత్తరాంధ్ర భూములను దోచేస్తుంటే మాట్లాడేవాడు లేడన్న జనసేనాని
- స్థానిక ఎమ్మెల్యేలు కూడా దోపిడీకి వత్తాసు పలుకుతున్నారని ఆరోపణ
- విస్సన్నపేటలో రూ.13వేల కోట్ల దోపిడీకి పాల్పడ్డారని ఆగ్రహం
- క్యాచ్మెంట్ ఏరియాలో రియాల్టీ వ్యాపారం ఎలా చేస్తారని ప్రశ్న
- సీఎం, రెవెన్యూ శాఖ, కలెక్టర్, అధికారులు బాధ్యత తీసుకోవాలని హితవు
ఉత్తరాంధ్ర భూములను దోచేస్తున్నారని, తెలంగాణలోను ఇలాగే దోచేస్తే తన్ని తరిమేశారన్నారు. క్యాచ్మెంట్ ఏరియాలో రియాల్టీ వ్యాపారం ఎలా చేస్తారని ప్రశ్నించారు. తాను సీఎం జగన్కే చెబుతున్నానని, మధ్యలో వచ్చి మాట్లాడే మంత్రులను పట్టించుకోనన్నారు. సీఎంగా ఉంటూ ఆయన చేసే అవినీతిని బయటపెడతామన్నారు. ఈ అక్రమాలకు జగన్, రెవెన్యూ శాఖ, కలెక్టర్, అధికారులు బాధ్యత తీసుకోవాలన్నారు. ప్రాథమిక హక్కులను ఎలా ఉల్లంఘిస్తారని ప్రశ్నించారు. ఇక్కడ దళితులకు ఇచ్చిన భూములు ఉన్నాయని, ఇక్కడ రోడ్లు ఎలా వేస్తారు? అని నిలదీశారు. అడ్డగోలుగా భూములను దోచేస్తుంటే కలెక్టర్ ఏం చేస్తున్నారన్నారు.
డీఎస్సీ నోటిఫికేషన్ లేదు.. జాబ్ క్యాలెండర్ లేదు... కానీ వేల కోట్లు దోచుకోవడానికి వైసీపీ నాయకులు రియల్ ఎస్టేట్ వెంచర్లు మాత్రం వేస్తారన్నారు. గ్రామాల్లో కనీసం రోడ్లు లేవని, కానీ ఇక్కడి రియాల్టీ వెంచర్లో 100 అడుగుల రోడ్డు, హెలిప్యాడ్ ఉందన్నారు. దళితుల భూములు, సాగునీటి ప్రాజెక్టులు ఆక్రమించి రూ.13వేల కోట్ల దోపిడీకి పాల్పడ్డారన్నారు. పర్యావరణాన్ని ధ్వంసం చేస్తున్నారని, సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన భూములు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. దీనిపై గ్రీన్ ట్రైబ్యునల్కు ఫిర్యాదు చేస్తామన్నారు. స్థానిక రైతులు భూకుంభకోణంపై ఫిర్యాదు చేశారని, అందుకే దీనిని పరిశీలించేందుకు వచ్చినట్లు చెప్పారు.