Mekapati Chandra Sekhar Reddy: టీడీపీ నేత బొల్లినేని, వైసీపీ బహిష్కృత నేత మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి భేటీ

టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు, వైసీపీ బహిష్కృత నేత మేకపాటి చంద్రశేఖరరెడ్డి ఏకాంత భేటీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి వరుసగా మూడుసార్లు వీరిద్దరూ ప్రత్యర్థులుగా తలపడ్డారు. నిన్న కలిగిరిలోని తన క్యాంపు కార్యాలయానికి వచ్చిన మేకపాటికి బొల్లినేని స్వాగతం పలికారు. అనంతరం ఇద్దరూ కాసేపు ఏకాంతంగా భేటీ అయ్యారు. 

అనంతరం మేకపాటి మాట్లాడుతూ.. ఉదయగిరి అభివృద్ది కోసమే బొల్లినేనితో చేతులు కలిపినట్టు చెప్పారు. మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డిని కూడా ఇప్పటికే కలిసినట్టు చెప్పారు. వీరిద్దరితోపాటు బీసీ నేత చెంచల బాబుయాదవ్‌తోనూ కలిసి పనిచేస్తూ ప్రజలకు అన్ని విధాల మేలు చేస్తానని పేర్కొన్నారు. ప్రజలతో మాట్లాడేందుకు త్వరలోనే బహిరంగ సమావేశం పెట్టనున్నట్టు తెలిపారు. 

అనంతరం బొల్లినేని మాట్లాడుతూ.. అండగా నిలిచిన మేకపాటి చంద్రశేఖరరెడ్డికి ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి ద్రోహం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత టీడీపీ కార్యకర్తలను ఎమ్మెల్యేకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా వీరిలో కొందరు మీ బాధితులు కూడా ఉన్నారని అనడంతో స్పందించిన మేకపాటి.. ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించాలని కోరారు.
Mekapati Chandra Sekhar Reddy
Bollineni Venkata Ramarao
Telugudesam
YSRCP
Nellore

More Telugu News