లీకేజీ వ్యవహారం వెనుక ఢిల్లీ పెద్దల కుట్ర: బీఆర్ఎస్ నేత బాల్క సుమన్

  • బెయిల్‌పై విడుదలయ్యాక బండి సంజయ్ అన్నీ అబద్ధాలు చెప్పారన్న బాల్కసుమన్ 
  • విద్యార్థులకు సంజయ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్
  • లీకేజీ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు వినతి
పదో తరగతి ప్రశ్న పత్రం లీకేజీ వెనుక ఢిల్లీ పెద్దల కుట్ర ఉందని బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ ఆరోపించారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ప్రశాంత్ బీజేపీలో ఫుల్ టైమర్ అని వాళ్ల పార్టీ నేతలే ఒప్పుకుంటున్నారంటూ ఓ వీడియో కూడా ప్రదర్శించారు. ఇంత జరుగుతున్నా ఏదో ఘనకార్యం చేస్తున్నట్టు బీజేపీ హైకమాండ్ బండి సంజయ్‌తో గో అహెడ్ అంటోందని ఎద్దేవా చేశారు. విడుదల అనంతరం నేడు బండి సంజయ్ చెప్పినవన్నీ అబద్ధాలని మండిపడ్డారు. ఆయన చరిత్రలో లీకు వీరుడిగా మిగిలిపోతారన్నారు.

ఈ వ్యవహారంలో కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం ఢిల్లీ పెద్దలదని, రాష్ట్రంలోని బీజేపీ, ఏబీవీపీ, ఇతర అనుబంధ సంఘాల నేతలు ఇందులో పాత్రధారులని వ్యాఖ్యానించారు. తెలంగాణలో వాళ్లకు చోటు దక్కడం లేదనే ఫ్రస్ట్రేషన్‌తో ఇలాంటి పేపర్ లీకేజీ ప్రకటనలు చేసి తెలంగాణ ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ చర్యలను తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా గమనించాలని సూచించారు. విద్యార్థులకు బండి సంజయ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను అభ్యర్ధించారు.

BJP
Bandi Sanjay
Balka Suman

More Telugu News