Puvvada Ajay Kumar: తెలంగాణ ప్రయాణికులకు అత్యాధునిక బస్సులు.. ప్రారంభించిన మంత్రి అజయ్ కుమార్

తెలంగాణ ఆర్టీసీకి కొత్త అత్యాధునిక బస్సులు అందుబాటులోకి వచ్చాయి. ట్యాంక్‌బండ్‌పై నేటి మధ్యాహ్నం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో 50 అత్యాధునిక సూపర్ లగ్జరీ బస్సులకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అప్పుడెప్పుడో కనుమరుగైన డబుల్ డెక్కర్ బస్సులు త్వరలోనే మళ్లీ అందుబాటులోకి రానున్నట్టు చెప్పారు. ప్రజలు సొంత వాహనాల వాడకాన్ని తగ్గించాలని సూచించారు. కరోనా సమయంలో ఆర్టీసీ రూ. 2 వేల కోట్లు నష్టపోయినట్టు చెప్పారు. 

తెలంగాణ ఆర్టీసీ రూ. 392 కోట్లతో మొత్తం 1,016 అధునాత బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా మొదటి విడతలో 630 సూపర్ లగ్జరీ, 130 డీలక్స్, 16 స్లీపర్ బస్సులకు టెండర్ల ద్వారా కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చింది. వచ్చే ఏడాది మార్చి నాటికి ఇవి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి.  

కాగా, తొలి విడత కొనుగోలు చేస్తున్న 760కిపైగా బస్సుల్లో నేడు 50 బస్సులను ప్రారంభించినట్టు మంత్రి చెప్పారు. మార్చి లోపల అన్ని బస్సులను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, రవాణా, రహదారి, భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, ఎండీ వీసీ సజ్జనార్, రవాణ శాఖ కమిషనర్ జ్యోతి బుద్ధ ప్రకాశ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Puvvada Ajay Kumar
Telangana
TSRTC
Luxury Bus

More Telugu News