జగన్ మొదటి నుంచీ చేస్తున్నది ఇదే: చంద్రబాబు ఫైర్

  • వ్యక్తులపై కక్షతో వ్యవస్థలను నాశనం చేయడం సరికాదు
  • టీడీపీ హయాంలో వీఐటీ, ఎస్ఆర్ఎం వంటి విద్యాసంస్థలు వచ్చాయని గుర్తు చేసిన బాబు
  • రాజకీయ లక్ష్యాలు సామాన్యులను ఇబ్బందికి గురిచేయకూడదని హితవు
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు తీవ్ర విమర్శలు చేశారు. వ్యక్తులపై కక్షతో జగన్ వ్యవస్థలను నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలోని ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయంలో భవనాలు, సదుపాయాలు, పరిశోధన కార్యక్రమాలు, బోధనా సిబ్బంది సహా అన్నీ బాగున్నాయి కానీ, ఇక్కడికి చేరుకునేందుకు సరైన రోడ్లు లేవని వర్సిటీ వ్యవస్థాపక కులపతి డాక్టర్ టీఆర్ పారవేందర్ ఆవేదన వ్యక్తం చేసిన న్యూస్ క్లిప్‌ను షేర్ చేసిన చంద్రబాబు.. ఈ మేరకు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నవారు వ్యక్తులపై కక్షతో వ్యవస్థలను నాశనం చేయడం సరికాదని అన్నారు. రాష్ట్రంలో జగన్ మొదటి నుంచి ఇదే చేస్తున్నారని ఆరోపించారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అమరావతికి ప్రతిష్ఠాత్మకమైన వీఐటీ, ఎస్ఆర్ఎం వంటి విద్యా సంస్థలు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.

మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేల సంఖ్యలో విద్యార్థులు వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారని పేర్కొన్నారు. అలాంటి సంస్థలు రాజధానిలో ఉండకూడదని కనీసం రోడ్ల సదుపాయం కల్పించకపోవడం, మరమ్మతులు చేయకపోవడం దారుణమని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయా సంస్థలకు వెళ్లడానికి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒక్కసారి ఆలోచించాలని సూచించారు. రాజకీయ లక్ష్యాలు ఏమైనా ఉండొచ్చు కానీ, అవి ఇలా సామాన్యులను ఇబ్బంది పెట్టేలా ఉండకూడదని హితవు పలికారు. ఇటువంటి ఆలోచనలు రాష్ట్రానికి కూడా గౌరవం కాదని చంద్రబాబు అన్నారు.


More Telugu News

Chandrababu Telugudesam YS Jagan VIT SRM Amaravati