Crocodile: బాలుడిని మింగిందని మొసలికి చిత్ర హింసలు.. నదిలో శవమై కనిపించిన బాలుడు

  • మధ్యప్రదేశ్‌లోని ష్యోపూర్ జిల్లాలో ఘటన
  • చంబల్‌ నదిలో స్నానానికి వెళ్లి గల్లంతైన బాలుడు
  • మొసలే మింగేసిందని భావించిన గ్రామస్థులు
  • దానిని పట్టుకుని పొట్ట కోసేందుకు ప్రయత్నం 
  • అడ్డుకుని కాపాడిన పోలీసులు
Crocodile Was Captured In Belief That Boy Was Alive

బాలుడిని మింగేసిందన్న అనుమానంతో ఓ మొసలిని పట్టుకున్న గ్రామస్థులు దానిని తాళ్లతో బంధించి చిత్ర హింసలు పెట్టారు. దాని పొట్ట కోసి బాలుడిని బయటకు తీయాలని భావించారు. సకాలంలో అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకోవడంతో మొసలి బతికిపోయింది. దానిని తిరిగి నదిలోకి వదిలిపెట్టారు. ఆ తర్వాత నదిలో గాలించగా బాలుడు శవమై కనిపించాడు. మధ్యప్రదేశ్‌లోని ష్యోపూర్ జిల్లాలో జరిగిందీ ఘటన. 

జిల్లాలోని రఘునాథ్‌పూర్‌కు చెందిన ఏడేళ్ల బాలుడు అతర్ సింగ్ సోమవారం చంబల్ నదిలో స్నానానికి వెళ్లాడు. ఆ తర్వాత కనిపించకుండా పోవడంతో బాలుడిని మొసలి మింగేసిందని భావించారు. వల సాయంతో దానిని పట్టుకుని బయటకు ఈడ్చుకొచ్చారు. అనంతరం తాళ్లతో బంధించారు. మొసలి కడుపులో బాలుడు ఉన్నాడని భావించి ఆక్సిజన్ వెళ్లేందుకు మొసలి నోరు మూయకుండా నోట్లో పెద్ద కర్ర పెట్టారు. 

అనంతరం దాని పొట్ట కోసి బాలుడిని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో సమాచారం అందుకున్న పోలీసులు, అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్రామస్థులకు నచ్చజెప్పి మొసలిని విడిపించి నదిలోకి విడిచిపెట్టారు. అనంతరం బాలుడి కోసం గాలించగా నదిలో శవమై కనిపించాడు.

More Telugu News