Andhra Pradesh: 7 నుంచి ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు

ap assembly budget sessions will start from march 7
షార్ట్స్‌లో చూడండి
ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు మార్చి 7 నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర వార్షిక బ‌డ్జెట్‌ను ఈ స‌మావేశాల్లోనే ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. 7న అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం కానుండ‌గా.. బ‌డ్జెట్‌ను మాత్రం మార్చి 11 లేదంటే 14వ తేదీల్లో ప్ర‌వేశ‌పెట్టే అవ‌కాశాలున్న‌ట్లుగా స‌మాచారం. ఇక ఈ స‌మావేశాల‌ను ఏకంగా మూడు వారాల పాటు నిర్వ‌హించే అవ‌కాశాలున్న‌ట్లు తెలుస్తోంది. ఈ విష‌యం అసెంబ్లీ స‌మావేశాల ప్రారంభానికి ముందు జ‌ర‌గ‌నున్న బీఏసీ స‌మావేశంలో నిర్ణ‌యించ‌నున్నారు. 

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల్లో భాగంగా ఉభ‌య స‌భ‌ల‌ను ఉద్దేశించి రాష్ట్ర గవ‌ర్న‌ర్ విశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్ ప్ర‌సంగించ‌నున్నారు. ఆ త‌ర్వాతి రోజు అంటే.. 8వ తేదీన ఇటీవ‌లే గుండెపోటుతో మ‌ర‌ణించిన మంత్రి మేక‌పాటి గౌత‌మ్ రెడ్డికి సంతాపం తెల‌ప‌నున్నారు. 9, 10 తేదీల్లో గ‌వ‌ర్న‌ర్ ప్రసంగానికి ధ‌న్య‌వాదాలు తెల‌ప‌నున్నారు. 

ఆ త‌ర్వాత  మార్చి 11 లేదా 14 తేదీల్లో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దాదాపు రూ.2.30 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్ ఉండే అవకాశముంది. ఇప్పటికే బడ్జెట్ పై అన్ని శాఖల కసరత్తు దాదాపు పూర్తయింది. ఈసారి బడ్జెట్లో విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యమివ్వాలని సీఎం వైఎస్ జగన్ సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం. అలాగే వ్యవసాయం పాడి పరిశ్రమపై దృష్టిపెడుతున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే.. జిల్లాల పునర్వ్యవస్థీకరణతో పాటు మరికొన్ని కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.
Go Back to Shorts
Andhra Pradesh
AP Assembly Session
ap budget

More Telugu News