నేటి అర్ధరాత్రి న్యూఇయర్ వేడుకలపై తెలంగాణ హైకోర్టులో వాదనలు
- బార్లలో వేడుకలకు సమయాన్ని పెంచారని లాయర్ల అభ్యంతరాలు
- ఢిల్లీ, మహారాష్ట్ర తరహాలో ఆంక్షలు విధించాలని విజ్ఞప్తి
- జోక్యం చేసుకోలేమని చెప్పిన హైకోర్టు
- పరిస్థితులను బట్టి రాష్ట్రాలు నిర్ణయాలు తీసుకుంటాయన్న కోర్టు
పబ్బులు, బార్లలో వేడుకలకు సమయాన్ని మరింత పెంచారని లాయర్లు హైకోర్టుకు చెప్పారు. ఢిల్లీ, మహారాష్ట్ర తరహాలో తెలంగాణలోనూ ఆంక్షలు విధించాలని విజ్ఞప్తి చేశారు. అయితే, అందుకు హైకోర్టు నిరాకరించింది. నూతన సంవత్సర వేడుకల విషయంలో జోక్యం చేసుకోలేమని చెప్పింది. పరిస్థితులను బట్టి రాష్ట్రాలు నిర్ణయాలు తీసుకుంటాయని హైకోర్టు వివరించింది.
వేడుకలపై ఇప్పటికే పోలీసులు మార్గదర్శకాలు జారీచేశారని గుర్తు చేసింది. తెలంగాణలో మొదటి డోసు వంద శాతం పూర్తయిందని న్యాయస్థానం గుర్తుచేసింది. అయితే, కరోనాపై కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు అమలు చేయాలని రాష్ట్ర సర్కారుకు సూచించింది. కరోనా మార్గదర్శకాలు ఉల్లంఘించిన వారిపై తమకు వివరాలు తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఈ కేసును ఈ నెల 4కు వాయిదా వేసింది.
కాగా, హైదరాబాద్ మహానగరంలో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునేందుకు యువత సిద్ధమైంది. దీప కాంతులు, హంగులు, ఆర్భాటలతో వేడుకలు జరుపుకునేందుకు వేదికలు ముస్తాబయ్యాయి. అయితే, న్యూ ఇయర్ వేళ ఈ రోజు అర్ధరాత్రి వరకు మద్యం అమ్మకాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం సరికాదని విమర్శలు వస్తున్నాయి. మద్యం అమ్మకాలకు అనుమతులు ఇచ్చి ఆంక్షలు విధిస్తే వాటిని ఎవరు పాటిస్తారని ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా మండిపడుతున్నారు.