మొత్తానికి కివీస్ ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని విడగొట్టిన భారత్

  • సెంచరీ దిశగా పయనిస్తున్న యంగ్‌ను పెవిలియన్ పంపిన అశ్విన్
  • తొలి వికెట్‌కు 151 పరుగుల భాగస్వామ్యం
  • భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటున్న కివీస్ బ్యాట్స్‌మెన్
కాన్పూరు టెస్టులో భారత బౌలర్లు ఎట్టకేలకు కివీస్ ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని విడగొట్టారు. టామ్ లాథమ్, విల్ యంగ్ పార్ట్‌నర్‌షిప్‌ను విడగొట్టేందుకు భారత బౌలర్లు నిన్న తీవ్రంగా శ్రమించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ ఉదయం కూడా వారిద్దరూ టీమిండియా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. ఓవర్ నైట్ స్కోరు 129/0తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ అదే దూకుడు కొనసాగించింది. చెత్త బంతులను బౌండరీకి తరలిస్తూ పరుగులు పెంచుకుంటూ వెళ్లారు. ఈ క్రమంలో సెంచరీ దిశగా పయనిస్తున్న యంగ్‌ను సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ దెబ్బకొట్టాడు.

అశ్విన్ బౌలింగులో సబ్‌స్టిట్యూట్ ఆటగాడైన శ్రీకర్ భరత్‌కు క్యాచ్ ఇచ్చిన యంగ్ ఇన్నింగ్స్‌ను ముగించాడు. దీంతో 151 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. మొత్తం 214 బంతులు ఎదుర్కొన్న యంగ్ 15 ఫోర్లతో 89 పరుగులు చేశాడు. ప్రస్తుతం టామ్ లాథమ్ 67, కెప్టెన్ కేన్ విలియమ్సన్ 12 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకుముందు భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 345 పరుగులకు ఆలౌట్ అయింది. కివీస్ జట్టు భారత్ కంటే 169 పరుగులు వెనకబడి ఉంది.


More Telugu News

Team New Zealand Team India Kanpur Test Will Young Ravichandran Ashwin