విద్యాసంస్థలకు వంద గజాల లోపు సిగరెట్లు, పొగాకు ఉత్పత్తుల విక్రయంపై నిషేధం!: అమలుకు శ్రీకారం చుట్టిన ఏపీ వైద్య ఆరోగ్య శాఖ
- ఇకపై పక్కాగా అమలు చేయనున్న తెలంగాణ ప్రభుత్వం
- హెడ్మాస్టర్లు, ప్రిన్సిపాళ్లకు అవగాహన కార్యక్రమాలు
- నిబంధనలు అతిక్రమించే వారికి రూ. 20 నుంచి రూ. 200 వరకు జరిమానా
తాజాగా, ఈ అంశంపై కేంద్రం నుంచి మరోమారు ఆదేశాలు రావడంతో అప్రమత్తమైన ఏపీ వైద్య ఆరోగ్యశాఖ దీనిని పటిష్ఠంగా అమలు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా విద్యా సంస్థలకు వంద గజాల (300 అడుగులు) దూరంలోని దుకాణాల్లో సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులు విక్రయించడాన్ని నేరంగా పరిగణిస్తారు. ఇకపై దీనిని పక్కాగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
నిబంధనలు ఉల్లంఘించి సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులను విక్రయించేవారికి రూ. 20 నుంచి రూ. 200 వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ఇతర శాఖల అధికారులతోపాటు హెడ్మాస్టర్లు, ప్రిన్సిపాళ్లకు కూడా ఇలా జరిమానా విధించే అవకాశం ఉన్నప్పటికీ ఈ విషయం ఎవరికీ పెద్దగా తెలియకపోవడం గమనార్హం. తెలిసినా కొందరు పట్టీపట్టనట్టు వ్యవహరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో హెడ్మాస్టర్లు, ప్రిన్సిపాళ్లకు అవగాహన కల్పిస్తున్నారు. విద్యా సంస్థల ప్రాంతాన్ని పొగాకు రహిత ప్రాంతం అని తెలిపేలా సైన్ బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. పొగాకు నియంత్రణపై ఆరు నెలలకు ఓసారి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని హెడ్మాస్టర్లు, ప్రిన్సిపాళ్లను వైద్య ఆరోగ్యశాఖ కోరింది.