గ్రూప్-1 పరీక్షల కేసు తీర్పును రిజర్వ్ లో ఉంచిన ఏపీ హైకోర్టు

High Court reserves decision on Group one mains
  • మెయిన్స్ పేపర్ల మూల్యాంకనంపై హైకోర్టులో పిటిషన్
  • ప్రైవేటు సంస్థకు మూల్యాంకన బాధ్యతలు ఇచ్చారని ఆరోపణ
  • ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు
  • మూల్యాంకనంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న విపక్షాలు
గ్రూప్-1 పరీక్షల మూల్యాంకనం కేసులో నేడు ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. అభ్యర్థుల మెయిన్స్ పేపర్ల మూల్యాంకనం ప్రైవేటు ఏజెన్సీకి ఇవ్వడం పట్ల హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రభుత్వ సంస్థ చేయాల్సిన పనిని ప్రైవేటు సంస్థ టీసీఎస్ చేయడం సరికాదని పిటిషన్ లో పేర్కొన్నారు. మెయిన్స్ పేపర్ల మూల్యాంకనాన్ని ప్రైవేటు ఏజెన్సీకి అప్పగిస్తామని ఏపీపీఎస్సీ చెప్పలేదని పిటిషన్ లో ఆరోపించారు. ఈ పిటిషన్ పై ఇరు వర్గాల వాదనలు విన్న పిమ్మట న్యాయస్థానం తీర్పును రిజర్వ్ లో ఉంచింది.

కాగా, గ్రూప్-1 మెయిన్స్ డిజిటల్ మూల్యాంకనంపై అటు విపక్షాలు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ అంశంలో గవర్నర్ జోక్యం చేసుకుని న్యాయం చేయాలని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ లేఖ కూడా రాశారు. ముందుగా ఎలాంటి అధ్యయనం చేపట్టకుండా డిజిటల్ మూల్యాంకనం చేయడం వల్ల విమర్శలు వస్తున్నాయని లోకేశ్ వివరించారు. 2018లో గ్రూప్-1 పరీక్షల నోటిఫికేషన్ వెలువడగా, 2020లో పరీక్ష నిర్వహించారు. గత ఏప్రిల్ లో ఫలితాలు ప్రకటించి ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థుల పేర్లను వెల్లడించారు.
Go Back to Shorts
AP High Court
Group-1 Mains
Evaluation
Digital
Andhra Pradesh

More Telugu News