Pangong Tso: చైనాకు చెక్​ పెట్టేందుకు 12 అధునాతన స్పీడ్​ బోట్లు!

  • పాంగోంగ్ సరస్సులో పెట్రోలింగ్ కోసం సైన్యం ఆర్డర్
  • గోవా షిప్ యార్డుతో రూ.65 కోట్ల ఒప్పందం
  • మే నుంచి రంగంలోకి మర పడవలు
Army orders 12 specialized fast patrol boats for Pangong Tso amidst military confrontation with China

సరిహద్దుల్లో చైనాకు చెక్ పెట్టేందుకు, సరిహద్దు గస్తీని మరింత కట్టుదిట్టం చేసేందుకు భారత సైన్యం 12 ప్రత్యేకమైన స్పీడ్ బోట్లను కొనుగోలు చేయబోతోంది. కొనుగోలు ప్రక్రియలపై ఇప్పటికే కేంద్రం వేగం పెంచింది. తూర్పు లడఖ్ లోని పాంగోంగ్  సరస్సు వద్ద చైనా ఆగడాలు పెరిగిపోవడం, ఎనిమిది నెలలుగా మన దేశంతో ఘర్షణలకు దిగుతుండడంతో అక్కడ నిఘా పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే అధునాతన నిఘా, ఇతర పరికరాలున్న 12 స్పీడ్ పెట్రోలింగ్ బోట్లను కొనుగోలు చేయనుంది.

అందుకు ప్రభుత్వ రక్షణ రంగ సంస్థ అయిన గోవా షిప్ యార్డుతో సైన్యం ఒప్పందం చేసుకుంది. రూ.65 కోట్లతో ఆ మరపడవలను సమీకరించనుంది. ఆ పడవల స్పేర్ పార్టులతో పాటు నాలుగేళ్ల పాటు వాటి నిర్వహణను గోవా షిప్ యార్డు చూసుకునేలా ఆర్మీ ఒప్పందం చేసుకుంది. ‘‘ఈ ఏడాది మే నుంచే గోవా షిప్ యార్డు ఆ పడవలను అందజేస్తుంది. పాంగోంగ్ సరస్సులో పెట్రోలింగ్ కోసం వాటిని వాడుతాం’’ అని ఆర్మీ అధికారి ఒకరు చెప్పారు.

కాగా, ప్రస్తుతం పాంగోంగ్ సరస్సులో పెట్రోలింగ్ కోసం సైన్యం దగ్గర 17 తక్షణ స్పందన దళ (క్యూఆర్టీ) బోట్లు ఉన్నాయి. చైనాతో ఘర్షణల నేపథ్యంలో వాటిని మరిన్ని పెంచనుంది. ఆ దేశం వాడుతున్న భారీ టైప్928బీ పడవలకు దీటుగా ఉండేందుకు గోవా షిప్ యార్డ్ నుంచి అధునాతన పడవలను మన ఆర్మీ కొనుగోలు చేస్తోంది. 

More Telugu News