Yeman: యెమెన్ ఎయిర్ పోర్టులో బాంబు పేలుడు... 22 మంది దుర్మరణం!

Heavy Blast in Yeman Airport
  • క్యాబినెట్ లక్ష్యంగా బాంబుదాడి 
  • 50 మందికి తీవ్ర గాయాలు
  • ప్రధాని విమానం ల్యాండ్ కాకముందే పేలుడు
అరబ్ దేశమైన యెమెన్ లోని ఏడెన్ విమానాశ్రయంలో క్యాబినెట్ మంత్రులు టార్గెట్ గా ఉగ్రవాదులు దాడి చేయగా, 22 మంది పౌరులు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో మరో 50 మందికి గాయాలు అయ్యాయి. పేలుడుకు కారణాలు తెలియనప్పటికీ, ప్రధాని సహా ఇతర మంత్రులు ఎయిర్ పోర్టును వీడి సురక్షిత ప్రాంతాలకు చేరారు.

ఇదే సమయంలో వారు చేరుకున్న ప్యాలెస్ సమీపంలో మరో బాంబు పేలిందని, దీనిలో ప్రాణనష్టం జరుగలేదని యెమెన్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ప్రధాని, క్యాబినెట్ మంత్రులు వస్తున్న విమానం ల్యాండ్ అయిన తరువాత బాంబు పేలి ఉంటే పరిస్థితి అత్యంత ఘోరంగా ఉండేదని దేశ సమాచార శాఖ మంత్రి నగుబీ అల్ అవగ్ వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం విమానాశ్రయాన్ని సైన్యం తన అధీనంలోకి తీసుకుందని అల్ అవగ్ వెల్లడించారు. కాగా, ఈ పేలుళ్లను ఐక్యరాజ్య సమితి సహా పలు అరబ్ దేశాలు ఖండించాయి. మృతుల కుటుంబాలకు సంతాపాన్ని తెలిపాయి. 2014 నుంచి యెమెన్ లో పౌరయుద్ధం జరుగుతోంది. వేర్పాటువాదులు, ఇరాన్ ను బలపరుస్తున్న హౌతీ రెబెల్స్ మధ్య పట్టుకోసం పోరాటం సాగుతోంది. దేశంలో జరిగిన అంతర్యుద్ధం కారణంగా దాదాపు 1.12 లక్షల మంది అమాయక ప్రజలు ప్రాణాలను కోల్పోయారు.
Yeman
Lebanon
Blast
Died
Airport

More Telugu News