నచ్చిన వారితో కలిసి జీవించే హక్కు యువతకు ఉంది: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

Allahabad high court sensational verdict
  • మతాంతర వివాహం చేసుకున్న యువతీయువకులు
  • పట్టుకుని బంధించిన యువతి తల్లిదండ్రులు
  • తమను వేరు చేయవద్దంటూ హైకోర్టులో పిటిషన్ 
యువతీ యువకులు తమకు నచ్చిన వారితో కలిసి జీవించే హక్కు ఉందని అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఓ కేసు విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని షహరాన్‌పూర్‌కు చెందిన పూజా అలియాస్ జోయా, షావెజ్‌లు ప్రేమించుకున్నారు.

 మతాలు వేరు కావడంతో పెద్దలు అంగీకరించరని ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. వారిని వెతికి పట్టుకున్న అమ్మాయి తల్లిదండ్రులు ఇద్దరినీ ఓ గదిలో నిర్బంధించారు. అయితే, వారు తమకు తెలిసిన వ్యక్తుల ద్వారా హైకోర్టును ఆశ్రయించారు. తామిద్దరం మేజర్లమని, తమకు కలిసి జీవించే అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు.

ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం యువతీయువకులు ఇద్దరినీ తమ ఎదుట హాజరు పరచాలని పోలీసులను ఆదేశించింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం భిన్న మతాలకు చెందిన వారు వివాహం చేసుకోవచ్చని అన్నారు. నచ్చిన వారితో కలిసి జీవించే హక్కు యువతీ యువకులకు ఉందని స్పష్టం చేశారు.
Go Back to Shorts
Uttar Pradesh
allahabad high court
marriage

More Telugu News