ఈ ప్రభావం ఏపీలో నిత్యావసరాల ధరలపై పడే ప్రమాదముంది: సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

  • పెరిగిన పెట్రో ధరలతో ప్రజలు అల్లాడుతున్నారు
  • రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ భారం రూ.4కి పెంచడం తగదు
  • సామాన్యుడిపై, ధనవంతుడిపై ఒకేలా పన్ను పెంపు న్యాయమా?
ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ పెంపుపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కరోనా సంక్షోభం వల్ల తలెత్తిన పరిస్థితుల వల్ల అల్లాడిపోతోన్న ప్రజలపై మరింత భారం మోపారని అన్నారు.

'అసలే పెరిగిన పెట్రో ధరలతో ప్రజలు అల్లాడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ భారం రూ.4కి పెంచడం తగదు. మోపెడ్ నడిపే సామాన్యుడిపై, ఆయిలింజన్ ఉపయోగించే సన్నకారు రైతుపై, బెంజ్ కారు వాడే ధనవంతుడిపైనా ఒకేలా పన్ను పెంపు న్యాయమా? ఈ ప్రభావం నిత్యావసరాల ధరలపై పడి పేదలకు ఇంకా భారమయ్యే ప్రమాదముంది' అని విమర్శించారు.  

'గతంలో ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.2 భారం తగ్గించిన సందర్భాలున్నాయి. ఓ వైపు ధరలు, మరోవైపు పన్ను పెంచి కరోనా కాలంలో ప్రజలను మరింత కష్టాలకు గురిచేయడం దారుణం. పెంచిన వ్యాట్ ను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి' అంటూ ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా 'అసలే మోత అదనంగా వాత' పేరిట ఓ పత్రికలో వచ్చిన వార్తను ఆయన పోస్ట్ చేశారు.


Somireddy Chandra Mohan Reddy
Telugudesam
Andhra Pradesh

More Telugu News