India: దేశంలో 12 వేలకు చేరువైన కోవిడ్ కేసులు.. మరో 39 మంది మృతి

  • నిన్న ఒక్క రోజే 1118 కేసుల నమోదు
  • కేసుల్లోనూ, మరణాల్లో మహారాష్ట్రదే అగ్రస్థానం
  • దేశంలో 392కు పెరిగిన మరణాల సంఖ్య
India reaching 12 thousand corona cases

దేశంలో కరోనా కేసులు 12 వేలకు చేరువయ్యాయి. గత 24 గంటల్లో 39 మంది ఈ వైరస్‌తో మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 392కు చేరుకుంది. తాజాగా మృతి చెందిన వారిలో మహారాష్ట్రకు చెందిన 18 మంది, యూపీకి చెందిన ఆరుగురు, గుజరాత్‌కు చెందిన నలుగురు, మధ్యప్రదేశ్‌కు చెందిన ముగ్గురు, ఢిల్లీ, కర్ణాటకకు చెందిన చెరో ఇద్దరు, తెలంగాణ, తమిళనాడు, పంజాబ్, మేఘాలయకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారు.

అలాగే, దేశవ్యాప్తంగా నిన్న 1118 నిర్ధారిత కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకుని దేశంలో మొత్తం కేసుల సంఖ్య 11,933కు పెరిగినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. వీటిలో 10,197 యాక్టివ్ కేసులని, 1343 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది. ఇక, మొత్తం మరణాల్లో 178 ఒక్క మహారాష్ట్రలోనే సంభవించడం గమనార్హం. కేసుల్లోనూ మహారాష్ట్రదే అగ్రస్థానం. అక్కడ ఇప్పటి వరకు 2,687 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానంలో ఢిల్లీ (1561), తమిళనాడు (1204), రాజస్థాన్ (1005) ఉన్నాయి.

More Telugu News