జగన్ ప్రకటనపై రోడ్డెక్కిన అమరావతి ప్రాంత రైతులు.. భారీగా మోహరించిన పోలీసులు

  • మూడు రాజధానులను ప్రకటించడంపై రాజధాని ప్రాంత రైతుల ఆగ్రహం
  • ఏపీలోకి దక్షిణాఫ్రికా సంస్కృతిని తీసుకొస్తారా? అంటూ మండిపాటు 
  • ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుకుంటున్నారన్న రైతులు
ఏపీకి మూడు రాజధానులంటూ ముఖ్యమంత్రి జగన్ ప్రకటించడం పట్ల అమరావతి ప్రాంత రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెలగపూడి, రాయపూడి, కిష్టాయపాలెం, మందడంలో రైతులు ఆందోళనకు దిగారు. రోడ్లపై బైఠాయించి సీఎంకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. వెంకటాయపాలెంలో రిలే నిరాహారదీక్ష చేపట్టారు. రైతుల ఆందోళన నేపథ్యంలో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు.

దక్షిణాఫ్రికాను ఆదర్శంగా తీసుకున్న జగన్... ఏపీలోకి ఆ దేశ సంస్కృతిని తీసుకొస్తారా? అని ఈ సందర్భంగా రైతులు ప్రశ్నించారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. ప్రతి ఏటా తుపానులతో విశాఖపట్నం ఎంతో నష్టపోతోందని అన్నారు. ఒక్క రాజధాని నిర్మాణానికే దిక్కులేకపోతే... మూడు రాజధానులను ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. ఇంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తారని అడిగారు. ఎన్నికలకు ముందు రాజధానిని మారుస్తామనే ప్రకటనను జగన్ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.
Go Back to Shorts
Jagan
YSRCP
Amaravathi
Farmers

More Telugu News