Vallabhaneni Vamsi: జగన్ ను కలవడం వెనుకున్న కారణాన్ని అసెంబ్లీలో వివరించిన వల్లభనేని వంశీ

  • నా నియోజకవర్గ అభివృద్ధి కోసమే జగన్ ను కలిశాను
  • జగన్ ను కలవడం ఇదే తొలిసారి కాదు
  • టీడీపీ నాపై దుష్ప్రచారం చేసింది
తన నియోజకవర్గ అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి జగన్ ను తాను కలిశానని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తెలిపారు. ముఖ్యమంత్రిని తాను కలవడం ఇదే తొలిసారి కాదని చెప్పారు. అసెంబ్లీలో మాట్లాడుతూ ఆయన ఈ మేరకు తెలిపారు. మరోవైపు, వంశీ మాట్లాడుతున్నప్పుడు టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

టీడీపీ సభ్యుల అభ్యంతరాల మధ్యే వంశీ మాట్లాడుతూ, జగన్ ను కలిసిన తర్వాత టీడీపీ తనపై దుష్ప్రచారం చేసిందని విమర్శించారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు మీడియాలో తాను చూశానని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు కుడికాలువపై కరెంటు పనులు, ఇళ్ల పట్టాల గురించి జగన్ ను తాను కలిశానని తెలిపారు.

తాను స్టేట్ ర్యాంకర్ నని... హాస్టల్ లో ఉండి చదువుకున్నానని వంశీ చెప్పారు. ఇంటర్ లో ఇంగ్లీష్ మీడియంలోకి మారినప్పుడు ఇంగ్లీష్ అర్థం కాక చాలా ఇబ్బంది పడ్డానని... ఒకానొక సమయంలో చదువు మానేద్దామని అనుకున్నానని తెలిపారు. ఇప్పుడు విద్యార్థులందరికీ ఇంగ్లీష్ మీడియం విద్యను తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించడం సంతోషకరమని... ప్రభుత్వాన్ని తాను అభినందిస్తున్నానని చెప్పారు.
Vallabhaneni Vamsi
Telugudesam
Jagan

More Telugu News