మద్యం మత్తులో వృద్ధుని దాష్టీకం...మూడేళ్ల మనవరాలిపై అత్యాచారం!

  • కూతురి కుమార్తెపై అఘాయిత్యం
  • బయటకు వెళుతూ పిల్లను చూడమని అప్పజెప్పిన దంపతులు
  • తిరిగి వచ్చేసరికి ఆపస్మారక స్థితిలో చిన్నారి

మద్యం మత్తులో ఓ వృద్ధుడు ఘోరాతి ఘోరానికి పాల్పడ్డాడు. ముక్కుపచ్చలారని మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం చేశాడు.  'కంచే చేను మేసింది....' అన్న చందంగా సొంత మనవరాలి పైనే అఘాయిత్యానికి ఒడిగట్టడం మరీ దారుణం. సభ్య సమాజం తలదించుకునే ఈ అకృత్యం కృష్ణా జిల్లా మండవల్లిలో చోటు చేసుకుంది. 


పోలీసుల కథనం మేరకు...సమీపంలోని గ్రామం నుంచి ఓ జంట బతుకుదెరువు కోసం మండవల్లి వచ్చి నివాసం ఏర్పాటు చేసుకున్నారు. వీరికి మూడేళ్ల పాప ఉంది. వీరితోపాటు మహిళ తండ్రి కూడా వీరితోనే ఉంటున్నాడు. మంగళవారం సాయంత్రం వారపు సంతకు వెళ్లిన దంపతులు తమ కుమార్తెను తాతకు అప్పగించి, జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు. 


రాత్రి 9 గంటల సమయంలో సంత నుంచి తిరిగి వచ్చిన దంపతులకు మంచంపై ఆపస్మారక స్థితిలో పడివున్న చిన్నారి కనిపించింది. ఏం జరిగిందని తండ్రిని నిలదీసే సరికి చేసిన ఘోరాన్ని అతనే చెప్పాడు. మద్యం మత్తులో తాను పొరపాటు చేశానంటూ ఒప్పుకున్నాడు. దీంతో లబోదిబోమంటూ దంపతులు చిన్నారిని తీసుకుని ఆసుపత్రికి పరిగెత్తారు.


అనంతరం నిన్న తెల్లవారు జామున బాధిత చిన్నారి తల్లి మండవల్లి పోలీసులకు తండ్రిపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు బాలికను వైద్య పరీక్షల నిమిత్తం కైకలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి విజయవాడ తీసుకువెళ్లారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం.

Go Back to Shorts
Crime News
Krishna District
mandavalli
rapecase

More Telugu News