మద్యానికి బానిసై తల్లిని వేధించిన తండ్రి.. రోకలి బండతో కొట్టి హత్య చేసిన కుమారుడు!

  • ఏపీలోని గుంటూరు జిల్లాలో ఘటన
  • మద్యానికి బానిస అయిన సాంబయ్య
  • తండ్రితో కిశోర్ వాగ్వాదం.. దాడి
మద్యం మానేయాలని పలుమార్లు తండ్రికి సూచించాడు. తల్లిని వేధించవద్దనీ, కలిసి సంతోషంగా ఉందామని వేడుకున్నాడు. అయినా సదరు తండ్రి కుమారుడి మాట వినిపించుకోలేదు. చివరికి తల్లిపై చేయి చేసుకోవడంతో కుమారుడు సహనం కోల్పోయాడు. తండ్రిని అతి కిరాతకంగా హత్య చేసి పోలీసులకు లొంగిపోయాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.

పాత గుంటూరులో సాంబయ్య అనే వ్యక్తి భార్య, ఇద్దరు కుమారులతో కలిసి నివాసం ఉంటున్నాడు. అయితే మద్యానికి బానిసైన సాంబయ్య భార్యను తరచూ వేధించేవాడు. ఈ విషయంలో కుమారులు ఎంత చెప్పినా సాంబయ్య వినిపించుకోలేదు. చివరికి నిన్న మరోసారి భార్యపై సాంబయ్య చేయి చేసుకున్నాడు. దీంతో ఆమె మనస్తాపంతో పుట్టింటికి వెళ్లిపోయింది.

ఈ విషయం తెలుసుకున్న పెద్ద కుమారుడు కిశోర్ ఆగ్రహంతో ఊగిపోయాడు. బెంగళూరు నుంచి ఇంటికి చేరుకుని తండ్రితో వాగ్వాదానికి దిగాడు. ఈ సందర్భంగా సహనం కోల్పోయిన కిశోర్ రోకలి బండతో తండ్రి తలపై పలుమార్లు దాడిచేశాడు. చనిపోయాడని నిర్ధారించుకున్నాక పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Go Back to Shorts
Andhra Pradesh
Guntur District
son killed father
Police

More Telugu News