గవర్నర్ తో చంద్రబాబు ఏకాంత భేటీ.. జగన్ పై హత్యాయత్నం, కేంద్రం వ్యవహార శైలిపై చర్చ!
- ఇద్దరు మంత్రుల ప్రమాణస్వీకారం
- అమరావతిలో భేటీ అయిన గవర్నర్, సీఎం
- కేంద్రం సహాయ నిరాకరణపై బాబు ఆవేదన
ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, జగన్ పై దాడి, సిట్ విచారణ, బీజేపీ నేతలు వ్యవహరిస్తున్న తీరుపై చంద్రబాబు గవర్నర్ తో చర్చించారు. తిత్లీ తుపాను బాధితులను కేంద్రం సరైన రీతిలో ఆదుకోకపోవడాన్ని సైతం సీఎం గవర్నర్ వద్ద ప్రస్తావించారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.
మోదీ ప్రభుత్వం సహాయ నిరాకరణ కారణంగానే కడపలో స్టీల్ ప్లాంటును, విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం చేపట్టాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. జగన్ పై హత్యాయత్నం అనంతరం గవర్నర్ నరసింహన్ నేరుగా డీజీపీకి ఫోన్ చేయడాన్ని బాబు తప్పుపట్టిన సంగతి తెలిసిందే. అసలు గవర్నర్ నేరుగా అధికారులకు ఫోన్ చేస్తే ఇక ప్రభుత్వం ఎందుకని ప్రశ్నించారు.