ఎమ్మెల్యే కిడారి, సోమల హత్య వెనుక వైసీపీ హస్తం: టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి ఆరోపణలు

  • వారిని హత్య చేయాల్సిన అవసరం మావోలకు లేదు
  • సోమను చంపడంతో అనుమానాలు బలపడుతున్నాయి
  • వైసీపీ నేతల హస్తంపై దర్యాప్తు కోరుతాం
టీడీపీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను కాల్చి చంపాల్సిన అవసరం మావోయిస్టులకు లేదని  విశాఖ అర్బన్‌ టీడీపీ అధ్యక్షుడు, దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్‌ ఆరోపించారు. వీరి హత్యల వెనక వైసీపీ నేతల హస్తం ఉందని ఆరోపించారు.

 కిడారికి క్వారీ అనుమతులు వైఎస్ హయాంలోనే వచ్చాయని ఆయన తెలిపారు. గత మూడు నెలలుగా ఆయన తవ్వకాలకు దూరంగా ఉంటున్నారని పేర్కొన్నారు. సివేరి సోమ అతి నిరాడంబరంగా జీవించే వ్యక్తి అని, కాబట్టి మైనింగ్ కారణాలతో వీరిని హత్య చేయాల్సిన అవసరం మావోలకు లేదని తేల్చి చెప్పారు. వీరి హత్యల వెనక రాజకీయ కోణం కనిపిస్తోందన్నారు.

ఒక్క కిడారిపైనే దాడి జరిగి ఉంటే ఇన్ని అనుమానాలు వచ్చి ఉండేవి కావన్నారు. హిట్‌లిస్టులో లేని సోమను కూడా హత్య చేయడంతో తమ అనుమానాలు బలపడ్డాయన్నారు. ఈ హత్యల వెనక వైసీపీ నేతల హస్తంపై దర్యాప్తు చేయాల్సిందిగా పోలీసులను కోరనున్నట్టు ఆయన తెలిపారు.
Go Back to Shorts
Andhra Pradesh
Kidari sarveshwara Rao
Siveri Soma
YSRCP
Maoists
Telugudesam

More Telugu News