ఏపీలో మరో రాజకీయ పార్టీ.. రేపు సొంత పార్టీని ప్రకటించనున్న కొత్తపల్లి గీత
- రేపు ఉదయం 11.30 గంటలకు పార్టీ ప్రకటన
- విజయవాడలో జరగనున్న కార్యక్రమంలో పార్టీ వివరాలను వెల్లడించనున్న గీత
- 2014లో వైసీపీ తరపున గెలిచిన అరకు ఎంపీ
కొత్త రాజకీయ పార్టీని స్థాపించనున్నట్టు అరకు ఎంపీ కొత్తపల్లి గీత ప్రకటించారు. ఈ నెల 24వ తేదీన (రేపు) ఉదయం 11.30 గంటలకు పార్టీని లాంచ్ చేస్తున్నామని ఆమె తెలిపారు. విజయవాడలోని బెంజ్ సర్కిల్ లో ఉన్న జ్యోతి కన్వెన్షన్ హాల్ లో ఏర్పాటు చేయనున్న కార్యక్రమంలో పార్టీకి సంబంధించిన వివరాలను వెల్లడించనున్నట్టు చెప్పారు.
2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి కొత్తపల్లి గీత గెలుపొందారు. ఆ తర్వాత వైసీపీకి ఆమె దూరమయ్యారు. టీడీపీలో చేరుతారనే ప్రచారం జరిగినప్పటికీ, ఆ పార్టీకి కూడా ఆమె అంతే దూరంలో ఉన్నారు. ఒకానొక సమయంలో ఆమె బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారనే వార్తలు కూడా వినిపించాయి. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ, కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టు ఆమె ప్రకటించారు.