Kumaraswamy: ముఖ్యమంత్రిగా కుమారస్వామి ఎన్నేళ్లు ఉంటారో తేల్చేసిన కాంగ్రెస్!

  • ఇరు పార్టీల మధ్య రాతపూర్వక అవగాహన
  • కుమారస్వామి ఐదేళ్లూ ఉంటారన్న కాంగ్రెస్
  • వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనూ కలిసే పోటీ
కర్ణాటకలో కాంగ్రెస్ దయతో గద్దెనెక్కిన కుమారస్వామి ఆ పదవిలో ఎన్నేళ్లుంటారో కాంగ్రెస్ చెప్పేసింది. పదవుల పంపకం ఓ కొలిక్కి రావడంతో నేడు ఎవరికి ఏయే పదవులు కేటాయించేది ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో సీఎంగా కుమారస్వామి పూర్తికాలం పదవిలో కొనసాగుతారని కాంగ్రెస్ స్పష్టం చేసింది. అంతేకాదు, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్-జేడీఎస్‌లు కలిసి పోటీ చేస్తాయని పేర్కొంది.

పదవుల పంపకాల్లోనూ ఇరు పార్టీలు ఓ అవగాహనకు వచ్చాయి. ఆర్థిక శాఖను జేడీఎస్‌కు ఇవ్వనుండగా, హోంశాఖను కాంగ్రెస్‌ తీసుకోనుంది. జేడీఎస్ సెక్రటరీ జనరల్ డానిస్ అలీ మాట్లాడుతూ ఈ ఒప్పందం రాతపూర్వకంగా ఉంటుందని పేర్కొన్నారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని ఐదేళ్లూ దిగ్విజయంగా నడుపుతామని ధీమా వ్యక్తం చేశారు. అన్ని విషయాలను పేపర్‌పై పెట్టాలనుకుంటున్నామని, దానివల్ల కుమారస్వామి సారథ్యంలోని సంకీర్ణ పాలన సాఫీగా సాగుతుందని అన్నారు.

గురువారం కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, డానిష్ అలీ బెంగళూరులో స్థానిక నేతలతో చర్చలు జరిపారు. బుధవారం రాత్రి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కాన్ఫరెన్స్ కాల్ ద్వారా చర్చలు జరిపి సమస్యను పరిష్కరించారు. దీంతో పదవుల పంపకం మధ్య స్పష్టత వచ్చింది.
Kumaraswamy
Karnataka
Congress
JDS

More Telugu News