‘కాంగ్రెస్’ రహిత కర్ణాటక కోసం ప్రజలు ఓటేశారు: అమిత్ షా

  • బీజేపీ విజయం కోసం లక్షలాది మంది కార్యకర్తలు కష్టపడి పనిచేశారు
  • కాంగ్రెస్ కేబినెట్ లో సగం మంది ఓడిపోయారు
  • బాదామిలో కేవలం 1,700 ఓట్ల తేడాతో సిద్ధరామయ్య గట్టెక్కారు
  • 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయం 
కాంగ్రెస్ రహిత కర్ణాటక రాష్ట్రం కావాలని కోరుకుంటూ ప్రజలు తమకు ఓటు వేశారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించామని అన్నారు. కాంగ్రెస్ కేబినెట్ లో సగం మంది ఓడిపోయారని, బాదామి నియోజకవర్గంలో కేవలం1,700 ఓట్ల తేడాతో గట్టెక్కిన సిద్ధరామయ్య, చాముండేశ్వర్ నియోజకవర్గంలో 35 వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారని ఎద్దేవా చేశారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ పై విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్షుడయ్యాక కులం, మతం ఆధారంగా దేశాన్ని విభజించే ప్రయత్నం జరిగిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక ఎన్నికల్లో ధన ప్రవాహం, నకిలీ ఓటర్ ఐడీ కార్డుల మోసాలు వెలుగుచూశాయని ఆరోపించారు. కర్ణాటకలో బీజేపీ విజయం కోసం లక్షలాది మంది కార్యకర్తలు కష్టపడి పనిచేశారని, 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని, మోదీ నేతృత్వంలో అభివృద్ధిని దేశంలోని నలుమూలల ప్రజలు ఆదరిస్తున్నారని అన్నారు.

Karnataka
bjp
amitsha

More Telugu News