'మసూద' చిత్రం తరువాత హీరో తిరువీర్‌ పలు చిత్రాల్లో నటించిన సరైన సక్సెస్‌ దక్కలేదు. ఈ సారి ఆయన ప్రముఖ కథానాయిక ఐశ్వర్య రాజేష్‌తో జోడి కట్టాడు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం 'ఓ..! సుకుమారి..' ఓ వినూత్న కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలోని వినోదం ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసిందా? ఈ చిత్రంతో తిరువీర్‌కు విజయం దక్కిందా? లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం. 

యాదగిరి అలియాస్‌ యాది (తిరువీర్‌) పెళ్లి ప్రయత్నాల్లో ఉంటాడు. తమ పక్క ఊరిలోని ఓ అమ్మాయిని పెళ్లి చూపులు చూడటానికి వెళ్లి దామిని (ఐశ్వర్య రాజేష్‌)ని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. ఎలాగైనా ఆమెనే పెళ్లి చేసుకోవాలని ఫిక్సయిపోతాడు.ఇక ఆ ఊళ్లో కూడా ఎలాగైనా దామినికి పెళ్లి చేసి ఊరి నుంచి పంపించేయాలని ఊరి ప్రజలు చూస్తుంటారు. దానికి కారణం ఆమెకు ఓ గమ్మతైన సమస్య ఉండటమే కారణం. ఆమెను ఎవరూ టచ్‌ చేసిన షాక్‌ కొడుతుంది. ఈ ప్రాబ్లమ్‌ వల్ల ఊరిలో జనాలు ఇబ్బంది పడుతుంటారు. అందుకే యాది ఇష్టపడిన వెంటనే అందరూ కలిసి దామిని పెళ్లి చేస్తారు. ఇక అసలు కథ ఇక్కడే ప్రారంభమవుతుంది. ముట్టుకుంటే షాక్‌ కొట్టే దామినితో యాది ఎలా కాపురం చేశాడు? అత్తారింట్లో దామినికి ఎదురైన పరిస్థితులు ఏమిటి? ఆమెకున్న సమస్యను భర్త ఎప్పుడు ఎలా తెలుసుకున్నాడు? యాది అసలు దామినిని పెళ్లి చేసుకోవడానికి కారణం ఏమిటి? అనేది మిగతా కథ. 

ఈ మధ్య తెలుగు సినిమాల్లో కథానాయకుడు లేకపోతే కథానాయికకి ఇలాంటి విచిత్రమైన సమస్యలు పెట్టి దాని చుట్టు కథ అల్లుకుంటున్నారు. ఇటీవల తిరువీర్‌ నటించిన 'పాపం ప్రతాప్‌' సినిమా, కెర్యాంప్‌లో హీరోయిన్‌కు ఓ గమ్మతైన సమస్య.. ఇలా ఈ సమస్య చుట్టు వినోదాన్ని అల్లుకుని దర్శకులు ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది ఆ కోవలోనే హీరోయిన్‌ ఐశ్వర్య రాజేష్‌కు ముట్టుకుంటే షాక్‌ కొడుతుందనే విచిత్రమైన సమస్య నేపథ్యంగా ఈ సినిమా కథను తయారుచేసుకున్నారు. అయితే షాక్‌ కొట్టే అమ్మాయి, ఆ విషయం తెలియక పెళ్లి చేసుకున్న అబ్బాయి,  ఇక ఈ ఇద్దరి మధ్య కాపురం ఎలా జరిగింది? ఇదంతా వినూత్నమైన పాయింటే. ఈ సమస్య చుట్టు కథనంను, వినోదాన్ని ప్రేక్షకులను ఎంగేజ్‌ చేసే విధంగా అల్లుకోవడమే అసలు ప్రతిభ. 

ఇలాంటి కథలను తెరపై ప్రజెంట్‌ చేయాలంటే దర్శకుడు చాలా లాజికల్‌గా ఆలోచించాలి. ఆ మేరకు స్క్రీన్‌ప్లేతో పాటు కడుపుబ్బా నవ్వించే వినోదాన్ని యాడ్‌ చేయాలి. అయితే దర్శకుడు ఈ సమస్య గురించి పెద్దగా చర్చించకుండా, ఎటువంటి లాజిక్స్‌ లేకుండా సినిమాను ముగించే ప్రయత్నం చేశాడు. ఫస్టాఫ్‌గా సో..సోగా సాగిన సెకండాఫ్‌ మరింత విసుగు పుట్టించే విధంగా దర్శకుడు చిత్రాన్ని రొటిన్‌గా తెరకెక్కించాడు. సినిమా ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం పాత్రలు ప్రయత్నించినా అది వృథా ప్రయాసగానే మిగిలింది. ఆ కామెడీ నవ్వు రాకపోగా విసుగొస్తుంది. సినిమా కాన్సెప్ట్‌లో మినహా, సన్నివేశాల్లో, సంభాషణల్లో ఎక్కడా కూడా కొత్తదనం కనిపించదు. పరమ రొటిన్‌గా సినిమాను భరించాల్సి వస్తుంది. కాన్సెప్ట్‌ అనుకోగానే సరిపోదు. అందుకు రచనా పరంగా సరైనా వర్క్‌ చేయాలి. అది ఈ సినిమా విషయంలో నూటికి నూరుశాతం లోపించింది.

యాదగిరి పాత్రలో అమాయకుడిగా తిరువీర్‌ నటించారు. అయితే తిరువీర్‌ ఈ మధ్య అన్ని ఒకే రకమైన పాత్రలు చేస్తున్న ఫీలింగ్‌ కలుగుతుంది. అవసరమైతే కొంత గ్యాప్‌ తీసుకోని ఓ మంచి స్టోరీతో తిరువీర్‌ రావాల్సిన అవసరం ఉంది. ఐశ్వర్య రాజేష్ పాత్ర వినూత్నంగా ఉందని ఆమె ఈ సినిమా ఒప్పుకున్నట్లు ఆమె పాత్ర చూస్తే అర్థమవుతుంది. అయితే ఆమె పాత్రకు మాత్రం న్యాయం చేసింది. దర్శకుడు బలమైన సన్నివేశాలు రాసుకోవకపోవడం వల్ల  వీళ్ల ప్రతిభ చూసే అవకాశం సినిమాలో రాలేదు. ఝాన్సీ, మురళీధర్‌ గౌడ్‌ తమ రెగ్యులర్‌ పాత్రల్లోనే కనిపించారు. 

కమెడియన్‌ విష్ణు కాసిని నవ్వులు పంచే ప్రయత్నం చేశాడు. ఆమని, శ్రీనివాస్‌ గవిరెడ్డి, ఆనంద్‌ తదితరులు తమ పరిధి మేరకు నటించారు. ఓవరాల్‌గా ఓ..! సుకుమారి..! ఐడియా బాగున్నా కథనం మీ ఓపికకు పరీక్ష పెడుతుంది. కాన్సెప్ట్‌ పరంగా సుకుమారిగా ఉన్నా...సినిమా ఆద్యంతం భరించాలంటే కఠినంగానే ఉంటుంది. . రోటిన్‌ కథనంతో, పండని హాస్యంతో, కొరవడిన భావోద్వేగాలతో, మీ ఓపికకు పరీక్ష పెట్టే ఈ సుకుమారి ఆడియన్స్‌కు కూడా షాకులు ఇచ్చింది..!