రాయలసీమ పౌరుషం ఏమిటో చూపిస్తాం: విజయసాయిరెడ్డి
- సీమ ప్రాంత అభివృద్ధికి ప్రతిరూపంగా కొత్త పార్టీ రాబోతోందన్న విజయసాయిరెడ్డి
- టీడీపీ, వైసీపీ రెండూ కుటుంబ రాజకీయాలకే ప్రాధాన్యతనిచ్చాయని విమర్శ
- యువత భాగస్వామ్యంతో సీమను తిరిగి రతనాలసీమగా మారుస్తానని హామీ
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త శకం ప్రారంభం కాబోతోందని, రాయలసీమ ప్రాంత అభివృద్ధి, స్థానిక ప్రజల ఆత్మగౌరవానికి ప్రతిరూపంగా త్వరలోనే నూతన ప్రాంతీయ రాజకీయ పార్టీ రాబోతోందని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు. అనంతపురంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన, టీడీపీ, వైసీపీ రెండూ కుటుంబ రాజకీయాలకే ప్రాధాన్యమిచ్చాయని... అసలైన రాయలసీమ పౌరుషాన్ని, ప్రాంతీయ సంక్షేమాన్ని కాపాడే బాధ్యతను తమ నూతన పార్టీ తీసుకుంటుందని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులవుతున్నా రెడ్డి కార్పొరేషన్ను ఎందుకు పునరుద్ధరించలేదని ఆయన నిలదీశారు. రాష్ట్ర విభజన అనంతరం సీమ ప్రాంతానికే చెందిన నాయకులు ముఖ్యమంత్రులుగా పనిచేసినప్పటికీ, రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులు, అభివృద్ధి పనులను నిర్లక్ష్యం చేశారని దుయ్యబట్టారు. చంద్రబాబు, జగన్ కుటుంబాలు కేవలం ఎన్నికల సమయంలోనే రాజకీయం చేస్తూ, సీమ నుంచి ప్రజల వలసలకు ప్రధాన కారణమయ్యారని ఆరోపించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే యువత భాగస్వామ్యంతో సీమను తిరిగి 'రతనాల సీమ'గా మారుస్తామని... అన్ని కులాలు, మతాల సంక్షేమానికి కట్టుబడి ఉంటామని అన్నారు.